– రోజుకు రెండు థాలీలూ కష్టమే
– ఖర్చు చేయలేని స్థితిలో ప్రజలు
– గ్రామాల్లో 40 శాతం.. పట్టణాల్లో పది శాతం మంది పరిస్థితి ఇదే!
– ప్రశ్నార్థకంగా భారతీయుల జీవన ప్రమాణాలు
– మోడీ పాలనలో మారని ప్రజల స్థితిగతులు
భారత్.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పబడుతున్నది. మోడీ పాలనలో దేశం అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థలలో దూసుకెళ్తున్నదని బీజేపీ ప్రచారం చేసుకుంటున్నది. అయితే, అసలైన అభివృద్ధి ప్రజలకు కడుపు నిండా ఆహారం లభించినప్పుడే సాధ్యమవుతుందన్నది మేధావులు, విశ్లేషకులు చెబుతున్న మాట. ప్రజలకు అందే ఆహారం(థాలీ) విషయానికి వస్తే.. భారత్లో ఇప్పటికీ లక్షలాది మంది ప్రజలు కనీసం రెండు పూటలా ఆహారం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పౌష్టికాహారం కోసం ఖర్చు పెట్టలేని దుస్థితిలో ఉన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజల బతుకులు ప్రశ్నార్థకంగా మారాయి.
న్యూఢిల్లీ: భారత్లో 2014 లోక్సభ ఎన్నికల సమయంలో అచ్చేదిన్ అంటూ మోడీ ప్రచారం చేసి, అధికారంలోకి వచ్చారు. కానీ, ప్రజలకు మాత్రం నేటికీ మంచి రోజులు రాలేదు. వారి జీవన ప్రమాణాలేమీ మెరుగుపడలేదు. ఇప్పటికీ, అనేక మంది భారతీయులు సరైన ఆహారం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రచురించబడిన జాతీయ నమూనా సర్వే (ఎన్ఎస్ఎస్)కు చెందిన గృహ విని యోగ సర్వే 2023-24 (హెసీ ఈఎస్ 2024).. వస్తు విని యోగంలో వేగవంతమైన వృద్ధి రేటు నిజంగా సాధించబడిందో లేదో అంచనా వేయటానికి, ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వేయటానికి అవకాశాన్ని అందిస్తుంది. ఆగస్టు, 2023 నుంచి జులై, 2024 మధ్య ఈ సర్వేను నిర్వహించారు.
జీవన ప్రమాణాలు : ఒక థాలీ సూచిక
భారత్లో 2014 నుంచి వినియోగంలో పెరుగుదల ఉన్నదని గణాంకాలు సూచిస్తు న్నాయి. అయితే, అసలు సమస్య దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలు. వినియోగానికి అను గుణంగా లేవని గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా, ఈ జీవన ప్రమాణ నిర్దేశం కోసం 2023-24 సర్వే సంవత్సరంలో ఆహారం(థాలీ)పై రోజువారీ తలసరి ఖర్చు ఆధారంగా అంచనా వేశారు. ఆహారంపై ప్రజలు ఖర్చు చేస్తున్నదెంత? రోజుకు ఎన్ని సార్లు భోజనాన్ని తీసుకుంటు న్నారు? అందులో ఏమేమి ఉంటున్నాయి? అనే విషయాల ఆధారంగా వారి జీవన ప్రమాణాలపై ఒక అంచనాకు రావచ్చన్నది విశ్లేషకుల మాట. రోజుకు రెండు థాలీ భోజనాన్ని తీసుకోవడాన్ని కనీస ఆమోదయోగ్యమైన జీవన ప్రమాణంగా వారు భావిస్తున్నారు.
2023-24లో గ్రామీణ భారత్ విషయానికొస్తే.. 40 శాతం మంది జనాభా రోజుకు రెండు శాఖాహార థాలీలను, 95 శాతం వరకు జనాభా రోజుకు రెండు మాంసాహార థాలీలను కొనుగోలు చేయలేకపోతున్నారు.
వీరు నెలవారీగా ఆహారంపై చేస్తున్న ఖర్చు రూ.1060 నుంచి రూ.1755 వరకు మాత్రమే ఉన్నది. గ్రామీణ ప్రాంతంలో ఆహార కొరత గుర్తించబడినదాని కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక పట్టణ ప్రాంత ప్రజల విషయంలో.. జనాభాలో పది శాతం మంది వరకు రోజుకు రెండు థాలీలకు ఖర్చు చేయలేక పోతున్నారు. ఇక 50 శాతం మంది రోజుకు ఒక శాఖాహారం, ఒక మాంసాహార థాలీని కొనుగోలు చేయలేకపోయారు.
వినియోగం పెరుగుదల.. వృద్ధిరేటు తగ్గుదల
భారత్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం పెరిగింది. కానీ, వృద్ధి రేట్లు మాత్రం తగ్గాయి. గత దశాబ్దంలో చివరి వినియోగ సర్వే జరిగిన ఏడాది 2011 నుంచి నెలవారీ తలసరి వ్యయం (ఎంపీసీఈ) వృద్ధి రేట్లను ఈ కింది పట్టిక సూచిస్తుంది.

