నవతెలంగాణ-హైదరాబాద్: భర్త చేసిన అప్పు తీర్చలేదని భార్యను చెట్టుకు కట్టేసి దాడి చేసిన దారుణ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందిచాలని, నిందితులపై చర్య తీసుకోవాలని, బాధితుల అప్పు మాఫీ చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనను విడుదల చేశారు. ”సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉన్న ఈ అనాగరికచర్య చిత్తూరు జిల్లా కుప్పం మండలం దాసేగానూరు పంచాయతీ నారాయణపురం గ్రామంలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప ఇదే గ్రామానికి చెందిన మునికృష్ణప్ప దగ్గర తీసుకున్న అప్పును చెల్లించమని ఆయన భార్యను చెట్టుకు కట్టేశాడు. చిన్న పిల్లాడు ఏడుస్తున్నప్పటికీ కనికరించకుండా అమానుషంగా ప్రవర్తించిన సంఘటనపై ప్రభుత్వం స్పందించి మునికృష్ణప్పపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి సొంత నియోజకర్గంలో ఈ సంఘటన జరగడం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అనాగరిక దాడులకు నిదర్శనం. ఇలాంటి ఫ్యూడల్ అణచివేత ఈ ఆధునిక కాలంలో కూడా కొనసాగడం ప్రభుత్వానికి సిగ్గుచేటు. రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్ అప్పులు పెరుగుతున్నాయని అనేక వార్తలొస్తున్నాయి. ఇటీవల బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం వెలటూరు గ్రామంలో పార్వతీబారు ఆత్మహత్య చేసుకుంది. ఫైనాన్స్ కంపెనీలు బలవంతాన వసూళ్ళు చేసుకోవడం కోసం అవమానాలకు గురిచేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఈ వేధింపులకు తాళలేక కొందరు గ్రామాలను వదిలిపెట్టడం, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కావున ప్రభుత్వం స్పందించి మైక్రో ఫైనాన్స్, వడ్డీ వ్యాపారుల ఆగడాలను అరికట్టడానికి రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించాలి” అని డిమాండ్ చేశారు.
మహిళను కట్టేసి దాడి చేసిన నిందితులపై కఠిన చర్య తీసుకోవాలి : CPI(M)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES