నవతెలంగాణ – హైదరాబాద్ : గాజా యుద్ధం, పాలస్తీనా అంశంపై కేంద్ర ప్రభుత్వం మౌనం పాటిస్తోందంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ విమర్శించారు. పశ్చిమాసియాతో సంబంధాల విషయంలో భారత్ తన చారిత్రక వైఖరికి దూరమవుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’లో ప్రత్యేక వ్యాసం రాశారు.
గాజాలో పౌరుల మరణాలపై భారత్ బలంగా స్పందించడం లేదని సోనియా విమర్శించారు. పాలస్తీనా హక్కులకు మద్దతుగా భారత్ గతంలో అవలంబించిన విధానానికి ఇప్పుడు దూరమవుతోందని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి స్వతంత్ర దర్యాప్తు కమిషన్ నివేదికను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. గాజాలో వేలాది మంది చిన్నారులు మరణించారని, మరెందరో గాయపడ్డారని తెలిపారు. అంతర్జాతీయ సమాజం ఇప్పటికీ ఈ ఘర్షణను నిలిపివేయడంలో విఫలమైందని వ్యాఖ్యానించారు. భారత్ ఈ అంశంలో ‘ఒంటరి మౌన స్వరం’గా మారిందని సోనియా అన్నారు. ఇది నైతికంగానే కాకుండా జాతీయ ప్రయోజనాల కోణంలోనూ సమర్థించలేని వైఖరని పేర్కొన్నారు. పాలస్తీనాతో భారత్కున్న చారిత్రక సంబంధాలను కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా స్పందించాలని కోరారు.



