Wednesday, June 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఎఫ్‌సీఐ లేఔట్‌ను పునరుద్ధరించిన హైడ్రా

ఎఫ్‌సీఐ లేఔట్‌ను పునరుద్ధరించిన హైడ్రా

- Advertisement -

– రహదారులతో పాటు..పార్కుల హద్దుల నిర్ధారణ
– ప్లాట్ల యజమానులపై సంధ్య కన్వెన్షన్‌ వారి దాడి
– పోలీసులకు ఫిర్యాదు
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌ గచ్చిబౌలి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఫెర్టిలైజర్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎంప్లాయీస్‌ కోపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ లే ఔట్‌ను హైడ్రా మంగళవారం పునరుద్ధరించింది. అయితే, ఈ సమయంలో అక్కడి ప్లాట్ల యజమానులపై కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. ఈ లేఔట్‌ హద్దులను చెరిపేస్తూ సంధ్యా కన్వెన్షన్‌ ప్రతినిధులు పలు నిర్మాణాలు చేయగా.. వాటిని గత నెల 6న హైడ్రా తొలగించిన విషయం తెలిసిందే. 20 ఎకరాలకు పైగా ఉన్న లేఔట్‌లో 170 వరకూ ప్లాట్‌ యజమానులున్నారు. 1980వ దశకంలో వేసిన లేఔట్‌ నామరూపాలు లేకుండా కబ్జాలకు గురైందని హైడ్రా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల హద్దులు లేకుండాపోయిన ఈ లేఔట్‌ను హైడ్రా పునరుద్ధరించింది. జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందితో కలిసి.. హైడ్రా అధికారులు ఈ లేఔట్‌కు మళ్లీ జీవం పోశారు. గతంలో ఉన్న లేఔట్‌ ప్రకారం రహదారులకు హద్దులు నిర్ధారించి.. వెంటనే వాటి నిర్మాణానికి చర్యలు తీసుకుంది. లేఔట్‌ ప్రకారం ప్రధాన రహదారులతోపాటు.. ఇంటర్నల్‌ రహదారులను పునరుద్ధరించింది. పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల హద్దులను నిర్ధారించడంతో అక్కడి ప్లాట్‌ యజమానులు హర్షం వ్యక్తం చేశారు. లే ఔట్‌ ప్రకారం ఎవరి ప్లాట్‌ను వారు గుర్తించి హద్దులు నిర్ధారించుకున్నారు. మ్యాంగో, యునెక్స్‌ ఫుడ్‌ కోర్టులతోపాటు స్పైసీ బార్‌ ఇలా 7 వరకూ ఉన్న దుకాణ సముదాయాలు కూడా రోడ్డుపై నిర్మించినట్టు అధికారులు గుర్తించారు. వాటిని తొలగించాలని నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లో వాటిని కూడా తొలగించి రోడ్డు నిర్మాణం చేపడతామని హైడ్రా ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు.
ప్లాట్ల యజమానులపై దాడి
ఇదిలా ఉండగా, లే అవుట్‌లో ప్లాట్‌ ఓనర్ల సమక్షంలో హైడ్రా సంస్థ రోడ్లను మార్కింగ్‌ చేస్తుండగా ఈ ప్రక్రియను వీడియో తీస్తున్న ప్లాట్‌ యజమానులపై సంధ్య కన్వెన్షన్‌ యజమాని శ్రీధర్‌రావు అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్‌పై కత్తులు, క్రికెట్‌ బ్యాట్లతో దాడి చేసినట్టు తెలిసింది. ఈ దాడిలో గాయపడిన వారు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై హత్యాయత్నం జరిగిందని, సంధ్య కన్వెన్షన్‌ యజమాని శ్రీధర్‌రావు అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని రమ్మశ్రీ కోరారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -