నవతెలంగాణ-హైదరాబాద్: ఓవైపు ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేసి..శాంతిచర్చలకు పిలువాలని మావోయిష్టు కేంద్ర కమిటీ, పలు పౌరసంఘాలు తెలియాజేస్తున్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడవుల్లో మారణకాండను ఆపడంలేదు. తాజాగాఅల్లూరి జిల్లా రంపచోడవరం మండలం సమీపంలో జరిగిన పోలీసుల ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ ఉన్నట్లు సమాచారం. ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి మిగిలిన మావోయిస్టులు పరారైనట్లు తెలుస్తోంది. 3 ఏకే 47 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవాళ తెల్లవారుజామున అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల సరిహద్దులో భీకర ఎన్కౌంటర్ జరిగింది.. కొండమొదలు, చింతకూరు, కొయ్యలగూడెం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు అగ్ర నేతలు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అల్లూరి జిల్లా పోలీసులు, గ్రేహౌండ్స్ సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి నుంచి కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం వారికి మావోయిస్టులు ఎదురుపడగా.. ఇరువర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి.