నవతెలంగాణ – మద్నూర్ : మనసుని నియంత్రించేది యోగా అని తెలంగాణ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ నందాల గంగాకిషోర్, వ్యాయామోధ్యాయుడు జాదవ్ గణేశ్, ప్రధాన వక్త, ప్రముఖ పద్యకవి డా.బి. వెంకట్లు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మద్నూరు తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం, జూనియర్ కళాశాలలో ప్రత్యేకమైన యోగా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. శరీర సౌష్ఠవానికి యోగాసనాలు చాలా ఉపయోగపడగలవని అన్నారు. సూర్యనమస్కారాలవల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. ధ్యానంవల్ల ఏకాగ్రత,పట్టుదల, దృఢసంకల్పం వంటి సద్గుణాలు అలవడుతాయని అన్నారు. పీ ఈ టీ జాదవ్ గణేశ్ నేతృత్వంలో -వివిధ భంగిమలతో కూడిన యోగాసనాలు, సూర్య ప్రణామాలు, పలురకాల యోగా పిరమిడ్స్ సభికులను ఆకట్టుకొన్నాయి.
యోగా డే అక్షరాల ఆకారములో 95 మంది బాలురు కూర్చొని అలరించారు. తాడాసనం, వృక్షాసనం, హనుమానాసనం, పద్మాసనం, వజ్రాసనం, శశాంకాసనం, ధనురాసనం, చక్రాసనం, కుక్కుటాసనం, గర్భాసనం, భూమాసనం, వృష్టాసనం మొదలగు ఆసనాలను 280 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు వేశారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రిన్సిపాల్ నందాల గంగాకిషోర్, ప్రముఖ పద్యకవి వ్యాఖ్యాత డా బి. వెంకట్, వ్యాయామ ఉపాధ్యాయుడు జాదవ్ గణేశ్, సహాయ ప్రిన్సిపాల్ సుమన్, ఉపాధ్యాయులు వేణుగోపాల్, నరహరి ప్రసాద్, రాము, నాగరాజు, గంగా ప్రసాద్, అశోక్, హన్మాండ్లు, సంజీవ్, బస్వరాజు, నరేశ్ విద్యార్థులు పాల్గొన్నారు.