నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ను అభివృద్ధి చేయడానికి ప్రధాని మోడీ రాలేదని, ప్రజల ఓట్ల కోసం వచ్చారని జన సూరజ్ ఫౌండర్ ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. మోడీ లక్ష్యం బీహార్ అభివృద్ది కాదని, రానున్న ఎన్నికల్లో ఓట్లు సాధించడానికి వస్తున్నారని, అంతేగాని రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు వృద్ధి చేయడానికి కాదన్నారు. పాత వాటినే పునరుద్దరించి..కొత్తగా చేస్తున్నట్లు ప్రధాని మాట్లాడుతున్నారని, “లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇప్పటికే మార్హౌరాలో ఉందని, అది కొత్తదేమి కాదని ఆయన ఆరోపించారు. బీహార్ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను ప్రధానమంత్రి విస్మరిస్తున్నారని ఆరోపించారు. మూసివేయబడిన చక్కెర కర్మాగారంపై ప్రధాని మాట్లాడాలన్నారు.
పదే పదే నెరవేరని వాగ్దానాల కారణంగా బీహార్ జనాలు సంవత్సరాలుగా భ్రమల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10-12 ఏండ్లు ప్రకటనలే తప్పా..పనులు జరుగుతాలేవని.. ప్రజలు గమనిస్తున్నారని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కువ మొత్తంలో బీహారీలు వలసలు పోతున్నారని మోడీ చెపుతున్నారని, అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం..వలస బాధితులకు ఎందుకు అవకాశాలు కల్పించడంలేదని ప్రశాంత్ కిశోర్ ప్రశ్నించారు. బీహార్ ప్రజలు వలసలు పోకుండా కేంద్రం ఎప్పుడు నివారిస్తుందన్నారు. ఎన్నికలు ఉన్నచోట ప్రభుత్వ కార్యక్రమాల సాకుతో ప్రధాని మోడీ పలుమార్లు బీహార్లో పర్యటిస్తున్నారని ఆయన మండిపడ్డారు.