నవతెలంగాణ – భోపాల్: రోగి అయిన మైనర్ బాలికపై డాక్టర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. అదే ప్రయివేట్ మెడికల్ కాలేజీ హాస్టల్లోకి రాత్రివేళ చొరబడిన వ్యక్తి వైద్య విద్యార్థినిపై లైంగికదాడికి యత్నించాడు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఒకే రోజు ఈ రెండు సంఘటనలు జరిగాయి. దేవాస్ జిల్లాలోని ఉజ్జయిని రోడ్లో అమల్తాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రయివేట్ ఆస్పత్రి ఉన్నది. రెండు నెలల కిందట 17 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి వైద్య చికిత్స కోసం 35 ఏండ్ల డాక్టర్ రూపమ్ జైన్ను సంప్రదించింది. కాగా, జూన్ 17న మెడికల్ చెకప్, కౌన్సెలింగ్ కోసం బాలికను ఆ ప్రయివేట్ ఆస్పత్రికి డాక్టర్ రూపమ్ జైన్ పిలిపించాడు. ఆ తర్వాత క్యాంపస్లోని తన నివాసానికి ఆమెను తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
బాధితురాలి ఫిర్యాదుతో డాక్టర్ రూపమ్ జైన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే డాక్టర్ జైన్పై కొన్ని ఫిర్యాదులు రావడంతో జూన్ 5న అతడ్ని తొలగించినట్లు ఆ ప్రయివేట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ డైరెక్టర్ సురేష్ తెలిపారు. మరోవైపు జూన్ 17న రాత్రివేళ అదే మెడికల్ కాలేజీ క్యాంపస్లోని లేడీ హాస్టల్లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. ఒక రూమ్లో నిద్రిస్తున్న ఎంబీబీఎస్ విద్యార్థినిని కత్తితో బెదిరించి లైంగికదాడికి ప్రయత్నించాడు. అయితే సొమ్మసిల్లినట్లు ఆమె నటించింది. తాగు నీరు ఇవ్వాలని అడిగింది. ఆ వ్యక్తి వాటర్ తెచ్చేందుకు వెళ్లగా వైద్య విద్యార్థిని ఆ గది నుంచి బయటకు పరుగెత్తింది. మిగతా వారిని ఆమె అప్రమత్తం చేయగా అతడు తప్పించుకుని పారిపోయాడు. ఈ సంఘటనపై మెడికల్ స్టూడెంట్స్ నిరసన తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.