నవతెలంగాణ-హైదరాబాద్: 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ అత్యధికంగా 45 శాతం ఖర్చు చేసినట్లు అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స (ఎడిఆర్) శుక్రవారం తెలిపింది. ఈ ఎన్నికల కోసం బీజేపీ సుమారు రూ. 1,494 కోట్లు ఖర్చు చేసిందని, మొత్తం ఎన్నికల వ్యయంలో ఇది 44.56 శాతమని పేర్కొంది. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిందని, ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ రూ.620 కోట్లు ఖర్చు చేయగా, మొత్తం వ్యయంలో 18.5శాతమని తెలిపింది. 32 జాతీయ, ప్రాంతీయ పార్టీల రికార్డులను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించినట్లు ఎడిఆర్ తెలిపింది.
మార్చి 16 నుండి జూన్ 6 వరకు నిర్వహించిన లోక్సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కింలలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ పార్టీలు మొత్తంగా రూ.3,352.81కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. ఈ ఖర్చులో జాతీయ పార్టీల వాటా రూ.2,204 కోట్లు (65.75శాతం). సేకరించిన మొత్తం నిధులలో, జాతీయ పార్టీలు రూ.6,930.246 కోట్లు (93.08శాతం) సేకరించగా, ప్రాంతీయ పార్టీలు రూ.515.32 కోట్లు (6.92శాతం) సేకరించాయని నివేదిక పేర్కొంది.
సార్వత్రిక ఎన్నికలు జరిగిన 90 రోజుల లోపు మరియు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 75 రోజుల లోపు రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ (ఇసి)కి వ్యయ నివేదికలను దాఖలు చేయాల్సి వుంటుంది. ఈ నివేదికలను విశ్లేషించి నివేదికను రూపొందించినట్లు ఎడిఆర్ తెలిపింది. నివేదిక సమర్పణలో తీవ్రమైన జాప్యం జరిగినట్లు ఎడిఆర్ గుర్తించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ) 168 రోజుల ఆలస్యంగా, బిజెపి 139 రోజుల ఆలస్యంగా నివేదికలను దాఖలు చేసినట్లు తెలిపింది. లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మాత్రమే ఏకీకృత నివేదికను సమర్పించినట్లు స్పష్టం చేసింది.
ప్రచారానికే అధిక ఖర్చు
పార్టీలు ప్రకటించిన మొత్తం వ్యయంలో రూ.2,008 కోట్లు లేదా 53 శాతం కంటే ఎక్కువ ఖర్చు ప్రచారానికే చేసినట్లు నివేదిక తెలిపింది. వ్యయంలో ప్రచారం అగ్రస్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో ప్రయాణ ఖర్చులు రూ. 795 కోట్లు, అభ్యర్థులకు ఏకమొత్తం అందించినవి రూ.402 కోట్లు. పార్టీలు వర్చువల్ ప్రచారాల కోసం రూ.132 కోట్లకు పైగాఖర్చు చేశాయి. అభ్యర్థుల నేరచరిత్రలను ప్రచురించడం కోసం రూ.28కోట్లు వెచ్చించాయి.
32 రాజకీయపార్టీలు ప్రచారం కోసం చేసిన మొత్తం ఖర్చులో, జాతీయ ప ఆర్టీలు రూ.1,511.3004 కోట్లు లేదా 75.25శాతం ఖర్చు చేయగా, ప్రాంతీయ పార్టీలు రూ.496.99 కోట్లు లేదా రూ.24.75శాతం ఖర్చు చేశాయి. ప్రయాణ ఖర్చులు , స్టార్ క్యాంపెయినర్లకు భారీగా నిధులు మళ్లించినట్లు నివేదిక తెలిపింది.