నవతెలంగాణ-హైదరాబాద్ : అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు ఇటీవలే కాలంలో జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అటవీ సమీప గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అటవీ సమీప గ్రామంలోని ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై చిరుతపులి దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయంబత్తూర్ జిల్లా వాల్పరై పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోష్ణి అనే నాలుగేళ్ల చిన్నారి తన ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. అదే సమయంలో అడవిలో నుంచి వచ్చిన చిరుతపులి బాలికపై దాడి చేసింది. అనంతరం అడవిలోకి లాక్కెళ్లింది. ఈ ఘటనతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, అటవీ అధికారులు బాలిక కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. సెర్చ్ లైట్లు, డ్రోన్లు, స్నిఫర్ డాగ్లతో కూడిన బృందాలు ప్రాంతంలో గాలింపు చేపడుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది.