– జులై నాటికి అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి
– ఆయిల్ పామ్ పంట విస్తరణకు కట్టుదిట్టమైన చర్యలు
– రాబోయే మూడున్నర ఏండ్లలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు : ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీదర్బాబు, పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-కరీంనగర్
ప్రతి ఒక్కరి సహకారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియం హాల్లో ఉమ్మడి జిల్లా పరిధిలో వ్యవసాయశాఖ, విద్యాశాఖ, హౌసింగ్ తదితర శాఖల పనితీరుపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో కలిసి మంత్రి సమీక్షా సమావేశం నిర్వమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల వారీగా సంబంధిత జిల్లా కలెక్టర్లు.. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, క్రాప్ బుకింగ్, సాగు వివరాలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతు భరోసా, ఆయిల్ పామ్ సాగు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, గ్రౌండింగ్ జరిగిన ఇండ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, బడి బాట, మధ్యాహ్న భోజనం తదితర అంశాలను వివరించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను సరి చేస్తూ, ఆర్థికపరమైన వెసులుబాటు చేసుకొని పాలన సాగిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా ప్రజలకు మేలైన పాలన అందించాలని, ఎక్కడా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని సూచించారు. జులై వరకు అవసరమైన విత్తనాలు, ఎరువుల స్టాక్ జిల్లాల్లో అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఆయిల్ పామ్ సాగుపై మరింత శ్రద్ధ వహించాలని, పంట చేతికొచ్చిన రైతుల అనుభవాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేయాలని కోరారు. హార్టికల్చర్ అధికారులతో పాటు వ్యవసాయ శాఖలోని ఏఈఓ, ఏఓలు కూడా లక్ష్యాలు నిర్దేశించుకొని పని చేయాలని ఆదేశించారు. నగరం, పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగు పెద్ద ఎత్తున చేయాలని తెలిపారు. విద్యా శాఖ పట్ల జిల్లా కలెక్టర్లు శ్రద్ధ వహించాలని, ప్రయివేటు పాఠశాలల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్య అందాలన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పెంచాలని, ప్రభుత్వ పాఠశాలల్లో వస్తున్న మార్కులను ప్రజలకు వివరించాలని ఆదేశించారు.
ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాబోయే మూడున్నర ఏండ్లలో సాచురేషన్ పద్ధతిలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని, వరికంటే రెండింతల ఆదాయం వచ్చే పంటలను రైతులకు సూచించాలని తెలిపారు. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రైతు భరోసాను 9 రోజుల వ్యవధిలో రూ. 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన వ్యవసాయ శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఒక గుంట భూమి కూడా పడావు పడకుండా వ్యవసాయం సాగు జరగాలని అన్నారు. వరి మాత్రమే కాకుండా క్యాష్ క్రాప్స్, హార్టికల్చర్ పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష, సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్, సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజరు, మేడిపల్లి సత్యం, చింతకుంట విజయ రమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, డాక్టర్ సంజరు కుమార్, కవ్వంపల్లి సత్య నారాయణ, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అగ్రగామిగా నిలపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES