Wednesday, June 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబడుల తనిఖీలకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి

బడుల తనిఖీలకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి

- Advertisement -

– ఉపాధ్యాయులతో పర్యవేక్షణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి : సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డికి టీఎస్‌యూటీఎఫ్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ కోసం డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈవో, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులను వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) ప్రభుత్వాన్ని కోరింది. అవసరమైన చోట కొన్ని అదనపు పోస్టులను మంజూరు చేయాలనీ, ప్రత్యేక యంత్రాంగం ద్వారా మాత్రమే పర్యవేక్షణ చేపట్టాలని సూచించింది. ఉపాధ్యాయులను పాఠశాలల పర్యవేక్షణ కోసం వినియోగించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్‌ కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పర్యవేక్షణకు ఎంఈవో అకడమిక్‌ పోస్టును అదనంగా సృష్టించాలని కోరారు. ఉన్నత పాఠశాలల పర్యవేక్షణకు రెవెన్యూ డివిజన్‌కు ఒక ఉప విద్యాధికారిని నియమించాలని సూచించారు. అన్ని జిల్లాలకూ రెగ్యులర్‌ డీఈవోలను నియమించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులను తనిఖీ అధికారులుగా నియమిస్తే క్యాడర్‌ సమస్యలు, సీనియార్టీ సమస్యలు వస్తాయని తెలిపారు. విద్యార్థులకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మండల రిసోర్స్‌ పర్సన్లుగా ఉపాధ్యాయులను నియమించినప్పుడు వచ్చిన ప్రతికూల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని మరోసారి అటువంటి విఫల ప్రయోగాన్ని ఉపసంహరించుకోవాలంటూ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -