– పరారీలో ఆర్టీవో చెక్ పోస్ట్ అధికారుల అసిస్టెంట్లు
– ప్రతి లారీ డ్రైవర్ నుంచి రూ.500 చొప్పున వసూళ్లు
– ఆరా తీస్తున్న ఏసీబీ సిబ్బంది
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ అంతర్రాష్ట్ర ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఏసీబీ అధికారుల దాడులతో ఈ చెక్ పోస్ట్ లో పనిచేసే ఆర్టిఓ అధికారుల అసిస్టెంట్లు పరారైనట్లు తెలిసింది. మన రాష్ట్రం నుంచి దేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్లే లారీల వద్ద ఈ చెక్ పోస్ట్ అధికారులు భారీ మొత్తంలో అక్రమ వసూళ్లు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఏసీబీ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ప్రతి లారీ డ్రైవర్ రూ.500 చొప్పున ఒక బాక్స్ లో వేసి వెళ్తున్నారు. డబ్బులు వేసి వెళ్లే లారీ డ్రైవర్లతో ఏసీబీ సిబ్బంది అక్రమ వసూళ్ల గురించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ అయినందున ప్రతిరోజు వేల సంఖ్యలు లారీలు మన రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు సరుకుల రవాణా చేస్తాయి. ఈ చెక్ పోస్ట్ లో నిబంధనల ప్రకారం సరుకు లారీలను పరిశీలన జరిపి టాక్స్ వసూలు చేయవలసి ఉండగా అలాంటిదేమీ చూడకుండా ప్రతి లారీ డ్రైవర్ వద్ద రూ.500 చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారు.
ప్రతిరోజు లక్షల రూపాయలు అక్రమ వసూళ్ల దందా కొనసాగుతున్నట్లు ఏసీబీ దాడులతో బట్టబయలైంది. ఇక్కడ డ్యూటీలు చేయడానికి రాష్ట్రంలో పైరవీలతో వస్తారని చర్చ జరుగుతోంది. దాని అసలు కారణం ఒక్కొక్క డ్యూటీలో లక్షల రూపాయలు అక్రమ వసూలతో జేబులు నింపుకోవడమే. ప్రభుత్వం ఆదాయానికి రావలసిన ఆదాయాన్ని రాబట్టకుండా అక్రమ వసూళ్లకే పాల్పడుతున్నారు అనడానికి ఏసీబీ దాడులే నిదర్శనం. ఏది ఏమైనా చాలా ఏండ్ల తర్వాత ఏసీబీ దాడులు జరగడం ఆర్టీవో శాఖ అధికారుల్లో దడలు పుట్టిస్తున్నాయి. ఏ విధంగా అక్రమ వసూలు జరుగుతున్నాయి అనేది ఏసీబీ అధికారులు విలేకరుల సమావేశంలో తేలనుంది.