Saturday, June 28, 2025
E-PAPER
Homeజాతీయంకాళ్లుపట్టి ప్రాధేయపడినా..

కాళ్లుపట్టి ప్రాధేయపడినా..

- Advertisement -

– బెంగాల్‌లో న్యాయ విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి
– కాలేజీలోనే దారుణం
– మృగాళ్లంతా తృణమూల్‌ విద్యార్థి విభాగానికి చెందినవారే
కోల్‌కతా:
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మరో ఘోరం వెలుగుచూసింది. ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాలలో విద్యార్థినిపై హత్యాచార ఘటనను దేశం ఇంకా మర్చిపోక ముందే తాజాగా న్యాయ కళాశాల ప్రాంగణం లోనే ఓ విద్యార్థిని (24)పై సామూహిక అఘాయిత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దక్షిణ కోల్‌కతాలో కస్బా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని న్యాయ కళాశాలలో ఓ విద్యార్థినిని బంధించిన ముగ్గురు మృగాళ్లు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. తనను వదిలేయాలంటూ ఆమె ఎంతగా ప్రాధేయపడినా కనికరం లేకుండా అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ముగ్గురు టీఎంసీ విద్యార్ధి విభాగం తృణమూల్‌ కాంగ్రెస్‌ ఛాత్ర పరిషత్‌కు చెందినవారే. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మోనోజిత్‌ మిశ్రా (31), నిందితులు జుబీర్‌ అహ్మద్‌ (19), ప్రామిత్‌ ముఖర్జీ (20) అరెస్టు చేయగా, కోర్టు వీరికి నాలుగు రోజుల కస్టడీ విధించింది.
మోనోజిత్‌ ప్రస్తుతం తృణమూల్‌ కాంగ్రెస్‌ ఛత్ర పరిషత్‌ దక్షిణ కోల్‌కతా జిల్లా యూనిట్‌ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. తనను పెండ్లి చేసుకోవాలని అతడు ప్రతిపాదించగా.. ఆమె నిరాకరించడం వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. బారుఫ్రెండ్‌కు హాని చేస్తానని, తన తల్లిదండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తూ కళాశాలలో బంధించాడని బాధితురాలు ఆరోపించారు. బాధితురాలు ఫిర్యాదు ప్రకారం బుధవారం రాత్రి 7:30 గంటల నుంచి 10:30 గంటల వరకూ ఈ దారుణం జరిగింది. మోనోజిత్‌ కాళ్లు పట్టుకొని వదిలేయాలని ప్రాధాయపడినా.. వదల్లేదని, సెక్యూరిటీ గార్డు రూమ్‌లోకి బలవంతంగా లాక్కెళ్లి లైంగికదాడికి ఒడిగట్టారని బాధితురాలు తెలిపింది. ‘తీవ్ర భయాందోళనకు గురయ్యా. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడి ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరినా ఎవరూ సహాయం చేయలేదు. ప్రధాన నిందితుడు అఘాయిత్యం చేస్తుంటే మిగతా ఇద్దరూ వీడియోలను రికార్డు చేశారు. నేను సహకరించకపోతే ఆ వీడియోలను అందరికీ చూపిస్తామని బెదిరించారు. అక్కడి నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించిన క్రమంలో హాకీ స్టిక్‌తో దాడి చేశారు. నాకు న్యాయం చేయండి” అని బాధితురాలు పోలీసులను కోరారు.
ఈ ఘటనకు ముందు తనను, మరో ఏడుగురిని క్యాంపస్‌ లోపల ఉన్న యూనియన్‌ గదిలోకి పిలిపించారని, అక్కడ మనోజిత్‌ మిశ్రా వ్యక్తిగత జీవితం, అతడికున్న పలుకుబడి గురించి చెప్పారని,తమ యూనియన్‌ పట్ల విధేయతతో ఉండాలని చెప్పారని ఫిర్యాదులో తెలిపారు. బుధవారం మధ్యాహ్నం కాలేజీకి వెళ్లగా.. ఆమెను బంధించి రాత్రివేళ ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు. ఆ తర్వాత రాత్రి 10.50 గంటల సమయంలో ఆమెను వదిలిపెట్టగా.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కస్బా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించి ఫోరెన్సిక్‌ పరీక్ష కోసం ఘటనా స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకున్నామన్నారు.
గురువారం ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా.. శుక్రవారం ఉదయాన్నే మరో నిందితుడిని ఇంట్లో అదుపులోకి తీసుకొని.. వారి నుంచి ఫోన్‌లను సీజ్‌ చేసినట్టు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -