– ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆత్మహత్యకు పాల్పడిన సీనియర్ జర్నలిస్ట్, కవయిత్రి స్వేచ్ఛకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (హెచ్యూజేె) నివాళులర్పించింది. శనివారం రాంనగర్ పార్సిగుట్టలోని ఆమె తల్లిదండ్రుల నివాసం వద్ద స్వేచ్ఛ మృతదేహానికి టీడబ్ల్యూజేఎఫ్, హెచ్యూజే నాయకులు పూలదండ వేసి అంజలి ఘటించారు. స్వేచ్ఛతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈసందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య మాట్లాడుతూ చురుకైన జర్నలిస్టుగా ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తూ, తన రచనలు, కవిత్వంతో ప్రజల్లో చైతన్యం నింపిన స్వేచ్ఛ అకాలమరణం దారుణమని వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజం నిఖార్సైన మహిళా జర్నలిస్టును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛ మరణంపై అనేక అనుమానాలున్నాయనీ, నిస్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. స్వేచ్ఛ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నివాళులర్పించిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షులు పి ఆనందం, బట్టిపాటి రాజశేఖర్, గుడిగ రఘు, రాధిక, కార్యదర్శులు సలీమా, చంద్రశేఖర్, హెచ్యూజే అధ్యక్షులు బి అరుణ్ కుమార్, నాయకులు లలిత, విజయ తదితరులున్నారు. ఇటీవల జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీకి జరిగిన ఎన్నికల్లో స్వేచ్ఛ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సొసైటీ తరుపున మేనేజింగ్ కమిటీ నాయకులు గోపరాజు, హష్మి, చారి తదితరులు స్వేచ్ఛ కుటుంబ సభ్యులకు రూ.50వేల ఆర్థికసాయం అందజేశారు.
జర్నలిస్టు స్వేచ్ఛకు టీబ్ల్యూజేఎఫ్, హెచ్యూజే నివాళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES