Sunday, June 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅక్రమ కేసులపై పోరాడి గెలిచిన సీపీఐ(ఎం)

అక్రమ కేసులపై పోరాడి గెలిచిన సీపీఐ(ఎం)

- Advertisement -

– ఎనిమిదేండ్లు కోర్టు చుట్టూ తిరిగిన నాయకులు
– ఇది ప్రజాపోరాటాల విజయం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్‌
నవతెలంగాణ-మంచిర్యాల

వాళ్లంతా ఎర్రజెండా నీడన కార్మిక, కర్షక, పేద ప్రజల పక్షాన పోరాడుతున్న నాయకులు. పోడు రైతుల గొంతుకై పాలకులను ప్రశ్నించారు.. పోడు రైతుల పక్షాన పోరాటాలు చేసి.. అటవీ అధికారుల అక్రమ కేసులో జైలుకెళ్లారు. ఈ కేసులో ఎనిమిదేండ్లు కోర్టు చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడారు. చివరకు కోర్టు ఆ నాయకులను నిర్దోషులుగా పేర్కొంటూ ఈనెల 27వ తేదీ (శుక్రవారం)న తీర్పు చెప్పింది. ఇది ప్రజా పోరాటాల విజయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవి కుమార్‌ తెలిపారు. కోర్టు తీర్పు నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో అందరూ కలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలోని పోడు భూములు, వాటి సమస్యలపై 2017 జులై 18న అప్పటి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన సీపీఐ(ఎం) నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఈ కేసుల్లో ఏ1గా బండారు రవి కుమార్‌, ఏ2గా ఎస్‌.సత్యనారాయణ, ఏ3గా ఎర్మా పున్నం, కనికరం రాజన్న, పోతు శంకర్‌, జి.ప్రకాష్‌, సంకె రవి, మునిమడుగుల బ్రహ్మయ్య, పుట్ట కృష్ణమాచారి ఉన్నారు. ఈ కేసులో ఉన్న ఇద్దరు ఇప్పటికే మృతిచెందారు. అందరూ ఎనిమిదేండ్లుగా జిల్లా కోర్టు చుట్టూ తిరిగి కేసు గెలిచారు. సుదీర్ఘ కాలం పోరాటం చేసి కోర్టులో కేసు గెలవడం ఆనందాన్నిచ్చిందని బండారు రవికుమార్‌ అన్నారు.

ఎర్రజెండాలు ఎప్పుడూ పేదల పక్షమే..
ఎర్ర జెండాలు ఎప్పుడూ పేద ప్రజల పక్షానే పోరాటం చేస్తాయని రవికుమార్‌ అన్నారు. జన్నారం, చెన్నూర్‌, దండేపల్లి, లక్షేట్టిపేట మండలాల్లో ఆదివాసులు, పేద ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించామని ఆయన గుర్తు చేశారు. చెన్నూర్‌ నియోజకవర్గంలో పోడు భూముల్లో ఆవులను మేపుతున్న ఆదివాసులను అరెస్టు చేసి.. దాదాపు 200 పశువులను బంధించారని, ఒక్కో పశువుకు రూ.1000 జరిమానా కట్టి తీసుకెళ్లాలని అటవీ అధికారులు ఆంక్షలు విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆవులు, దూడలతో రోడ్డుపై రాస్తారోకో చేసి రూపాయి కూడా జరిమానా చెల్లించకుండానే విడిపించుకుపోయామని తెలిపారు. ఆ రోజులు తన మదిలో ఇంకా మెదులుతున్నాయనీ, అలాంటి పోరాటాలు చేసిన ఘనత సీపీఐ(ఎం)కు దక్కుతుందని చెప్పారు. కొన్నేండ్లుగా జిల్లాలో పోడు రైతుల కోసం పోరాటాలు చేయగా 1847 మందికి 3821 ఎకరాల భూమి దక్కిందని, ఆ భూములకు రైతుబంధు కూడా వర్తిస్తోందని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పోడు రైతులు సాగు చేసుకుంటున్న భూములకు అటవీ హక్కు పత్రాలు అందించాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన పెద్దఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన వెంట సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శి సంకె రవి, గోమాస ప్రకాష్‌, ఎర్మా పున్నం, కనికరపు అశోక్‌, సామల ఉమారాణి, రంజిత్‌ కుమార్‌, బ్రహ్మయ్య ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -