నవతెలంగాణ – ముంబయి : ప్రతిపక్షాలు, ప్రజల నుండి వచ్చిన ‘ఒత్తిడి’ కారణంగానే ప్రాథమిక తరగతుల్లో హిందీని మూడవ భాషగా బోధించాలనే నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని శివసేన (యుబిటి) ఎమ్మెల్యే ఆధిత్యథాకరే సోమవారం పేర్కొన్నారు. సోమవారం నుండి మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. శాసనమండలిలో ప్రతిపక్ష నేత అంబదాస్ దన్వే, భాస్కర్ జాదవ్ మరియు ఇతర ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో కలిసి ఆధిత్యథాకరే అసెంబ్లీ ఎదుట ఆందోళన చేపట్టారు. ‘మి మరాఠీ (నేను మరాఠీని)’ అని రాసి వున్న ప్లకార్డులను ప్రదర్శించారు.
అధికారంలో ఉన్నప్పటికీ, హిందీ విధించడాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలు, ప్రతిపక్షాలు మరియు ఇతరుల ఒత్తిడి కారణంగా ప్రభుత్వం తన సొంత తీర్మానాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని థాకరే పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారిక నిర్ణయాన్ని లిఖిత పూర్వకంగా జారీ చేసేంత వరకు తాము ఒత్తిడి కొనసాగిస్తామని అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని విశ్వసించలేమని అన్నారు. మరాఠీ ప్రజల ఐక్యతను ఢిల్లీ ఎదుట ప్రదర్శించాలని అన్నారు. ఉద్ధవ్ ధాకరే, రాజ్థాకరేల మధ్య ఐక్యతను అడ్డుకునేందుకు బిజెపి, డిప్యూటీ సిఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన తీవ్రంగా కృషి చేస్తున్నాయని అన్నారు. మరాఠీల గర్వాన్ని విభజించగలమని భావిస్తే అది తప్పేనని మండిపడ్డారు. కమిటీని నియమించినందున మహారాష్ట్ర ప్రభుత్వంపై తమకు సందేహం ఉందని, తమ డిమాండ్ పాక్షికంగానే నెరవేరిందని అన్నారు.
మహారాష్ట్రలోని 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు పాఠశాలల్లో హిందీ భాషను ప్రవేశపెట్టడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కోవడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం త్రిభాషా విధానం అమలుపై రెండు తీర్మానాలను (జిఆర్) వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. భాషా విధానంపై విద్యావేత్త నరేంద్ర జాదవ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.