నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలోని ఐదు హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్లను నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మధ్యప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, గువాహతి, పట్నాల్లో కొత్త సీజేలను నియమించిన కేంద్రం.. నలుగురు సిట్టింగ్ జడ్జిలను వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సలహాతో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఈ నియామకాలు చేపట్టారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక సీజేగా ఉన్న జస్టిస్ సంజీవ్ సచ్దేవాను అక్కడే శాశ్వత సీజేగా నియమించారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్ తార్లోక్ సింగ్ చౌహాన్కు జార్ఖండ్ హైకోర్టు సీజేగా పదోన్నతి లభించింది. ఢిల్లీ హైకోర్టు జడ్జి విభు బాఖ్రూను కర్ణాటక హైకోర్టు సీజేగా నియమించారు. పట్నా హైకోర్టు తాత్కాలిక సీజేగా ఉన్న జస్టిస్ ఆశుతోష్ కుమార్ను గువాహతి హైకోర్టు సీజేగా నియమించినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే పట్నా హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలికి అదే కోర్టులో సీజేగా పదోన్నతి లభించింది.
దేశవ్యాప్తంగా నాలుగు హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్లను బదిలీ చేశారు. రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవను మద్రాస్ హైకోర్టుకు పంపించారు. అలాగే త్రిపుర సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ను తెలంగాణకు, జార్ఖండ్ సీజే జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావును త్రిపురకు, మద్రాస్ సీజే జస్టిస్ కేఆర్ శ్రీరామ్ను రాజస్థాన్కు బదిలీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.