*వర్షాలతో జంట జలాశయాలకు జలకళ
* క్రమంగా చేరుతున్న వరద నీరు
* హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఒక గేట్ అడుగు మేర ఎత్తివేత
* మూసీ నదిలోకి 339 క్యూసెక్కుల వరద నీరు విడుదల
* అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎండీ అశోక్ రెడ్డి సూచన
నవతెలంగాణ హైదరాబాద్: కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద నీరు వస్తోంది. దీంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఒక గేట్ ను నేడు (గురు వారం) రాత్రి 10 గంటలకు జలమండలి అధికారులు ఎత్తారు.రిజర్వాయర్ ఒక్క గేటును ఒక ఫీటు మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 1000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా.. 339 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినందున ఎండీ అశోక్ రెడ్డి సంబంధిత జలమండలి అధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలు, హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.

హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వివరాలు:
పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు
ప్రస్తుత నీటి స్థాయి : 1762.70 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.970 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 2.734 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 1000 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో :339 క్యూసెక్కులు
మొత్తం గేట్ల సంఖ్య : 17
ఎత్తిన గేట్ల సంఖ్య : 01