Monday, May 5, 2025
Homeసోపతిస్విట్జర్లాండ్‌ ఆఫ్‌ ఇండియా పహల్గాం

స్విట్జర్లాండ్‌ ఆఫ్‌ ఇండియా పహల్గాం

- Advertisement -

అందమైన ప్రకృతి, ఎత్తైన కొండలకు నెలవు జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం. అలాంటి ప్రాంతం నేడు చిగురుటాకులా వణికిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. పర్యాటకుల రక్తంతో ఆ నేల తడిసిపోయింది. ఆత్మీయుల రోధనలతో ఆ ప్రాంతమంతా విషాదం అలముకుంది. ఇటీవల టూరిస్టులపై జరిగిన దాడిలో 26 మంది చనిపోయిన సంఘటనతో దేశమంతా నిర్ఘాంతపోయింది. ఈ దాడికి నిరసనగా కశ్మీర్‌లో వ్యాపార సంస్థలను, విద్యా సంస్థలను మూసివేశారు. ప్రజా రవాణా సౌకర్యాలు కూడా ఈ దాడి వల్ల ప్రభావితమయ్యాయి. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కు చెందిన సెక్యూరిటీ బృందం శ్రీనగర్‌కు చేరుకుంది. మరిన్ని భద్రతా బలగాలు, ఉన్నత భద్రతా అధికారులు పహల్గాం చేరుకునే అవకాశం కనిపిస్తోంది. పహల్గాంకు ఐదు కిలోమీటర్ల దూరంలోని బైసరన్‌ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతానికి సంబంధించిన వివరాలు…
జమ్మూకశ్మీర్‌కు వచ్చే పర్యటకులు అత్యంత ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో పహల్గాం ఒకటి. పచ్చిక బయళ్లు, అందమైన సరస్సులతో ఆహ్లాదకరంగా ఉండే ప్రాంతం కావడంతో ఇక్కడికి పెద్ద సంఖ్యలో దేశ, విదేశీ పర్యాటకులు వస్తుంటారు. అధికారిక లెక్కల ప్రకారం 2024లో 35 లక్షల మంది కశ్మీర్‌లో పర్యటించారు. మార్చి నుంచి జూన్‌ మధ్య కాలంలో పర్యటకులు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఈ సమయంలో పహల్గాం అందాలను చూసే అవకాశం ఉంటుంది. అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతమంతా మంచుతో కప్పేసి, తీవ్రమైన చలి ఉంటుంది.
స్విట్జర్లాండ్‌లోని లంగెర్న్‌ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యానికి పహల్గాంకు దగ్గర పోలికలు ఉన్నాయని ప్రకృతి ప్రేమికులు అంటుంటారు. స్విట్జర్లాండ్‌లో ఉన్నట్లు కనుచూపు మేర ముదురు ఆకుపచ్చ రంగులో పచ్చిక మైదానాలు బైసరన్‌ వ్యాలీలో కనిపిస్తుంటాయి. అందుకే దీన్ని ‘మినీ స్విట్జర్లాండ్‌’గా చెబుతుంటారు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోని అనంత్‌నాగ్‌ జిల్లాలో చుట్టూ పచ్చని అరణ్యంతో, ఎత్తైన కొండల మధ్యన పహల్గాం ఉంటుంది. అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే మార్గాల్లో అత్యంత ముఖ్యమైన ప్రాంతం ఇది. చూడగానే మైమరిచిపోయే ప్రకృతి అందానికి పెట్టింది పేరుగా పహల్గాం నిలుస్తోంది. పహల్గాం చుట్టుపక్కల ఎన్నో చూడదగ్గ ప్రదేశాలున్నాయి.
ఎలా చేరుకోవాలి..?
పహల్గాంకు అత్యంత సమీపంలో ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం శ్రీనగర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టుకు ఈ ప్రాంతం 96 కి.మీ. దూరంలో ఉంటుంది. అదే రైలు మార్గం గుండా అయితే… పహల్గాంకు దగ్గర్లో ఉదమ్‌పూర్‌, జమ్మూలు ఉంటాయి. పహల్గాంకు ఉదమ్‌పూర్‌ 217 కి.మీల దూరం కాగా, జమ్మూ 285 కి.మీల దూరంలో ఉంటుంది. అక్కడి నుండి బస్సు లేదా క్యాబ్‌లో పహల్గాంకు వెళ్లాలి. పహల్గాం నుంచి జమ్మూ, కశ్మీర్‌కు మంచి రోడ్డు మార్గం ఉంది. జమ్మూ, శ్రీనగర్‌, అనంత్‌నాగ్‌ నుంచి రాష్ట్ర బస్సు సర్వీసులు, ప్రైవేట్‌ బస్సులు అందుబాటులో ఉంటాయి. ట్యాక్సీలో కూడా వెళ్లచ్చు.
పర్యాటక ప్రదేశాలు
పహల్గాంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా చందన్‌వరీ, బైసరన్‌, శేష్‌నాగ్‌ లేక్‌, పంచతర్ణి, అమర్‌నాథ్‌ గుహ, అరు వ్యాలీ, లిడ్డర్‌వాట్‌ ఉన్నాయి.
చందన్‌వరీ: ఇక్కడి మంచు వంతెన ఎంతో ఫేమస్‌. అమర్‌నాథ్‌ యాత్ర చందన్‌వరీ గుండా సాగుతుంది. అమర్‌నాథ్‌కు వెళ్లే రెండు మార్గాల్లో ఇదొకటి. ఇది చాలా చిన్న లోయ.
బైసరన్‌: జమ్మూ కశ్మీర్‌లో పర్యటకులపై దాడి బైసరన్‌ ప్రాంతంలోనే జరిగింది. పచ్చిక మైదానంలో మంచుతో కప్పేసిన పర్వతాలు ఈ ప్రాంతపు సుందర దృశ్యాన్ని పర్యటకులకు అందిస్తుంటాయి. బైసరన్‌ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో 3,353 మీటర్ల ఎత్తులో తులియన్‌ సరస్సు మంచుతో కప్పేసి ఉంటుంది. దీనికి మూడు వైపులా మంచు పర్వతాలే ఉంటాయి.
శేష్‌నాగ్‌ సరస్సు: జూన్‌ వరకు మంచుతో ఉండే ఈ సరస్సు నీరు గ్రీన్‌, బ్లూ రంగులో కనిపిస్తుంటుంది. చందన్‌వరీ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో శేష్‌నాగ్‌ ఉంటుంది. సముద్ర మట్టానికి 11,330 అడుగుల ఎత్తులో ఇది ఉంటుంది. పురాణాల ప్రకారం శేష్‌నాగ్‌ తలను పోలిన ఏడు శిఖరాలు ఉండటంతో ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చినట్టు ప్రచారంలో ఉంది. ఇది ట్రెక్కింగ్‌కు ఫేమస్‌.
పంచతర్ణి: ఐదు ప్రవాహాల సంగమమే పంచతర్ణి. దీనికి పేరు కూడా అలానే వచ్చింది. అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లేవారికి పంచతర్ణి చివరి క్యాంపింగ్‌ సైట్‌. అక్కడి నుంచి 6 కి.మీల దూరంలోనే అమర్‌నాథ్‌ ఉంటుంది.
అమర్‌నాథ్‌: శివుణ్ని దర్శించుకునేందుకు ఈ ఆధ్యాత్మిక యాత్ర పహల్గాం నుంచి ప్రారంభమవుతుంది. మంచు రూపంలో కనిపించే అమరేశ్వరుడి దర్శనం కోసం ప్రతి ఏడాది జూలై నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో వేలమంది ఈ ప్రాంతానికి వెళ్తుంటారు. ఈ ఏడాది ఇప్పటికే ఈ యాత్రకు చెందిన రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జూలై 3 నుంచి యాత్ర మొదలవుతుంది. ఈ ఏడాది ఆగస్టులోనే ఈ యాత్ర ముగుస్తున్నట్లు జమ్మూకశ్మీర్‌ శ్రీఅమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర బోర్డు (ఎస్‌ఏఎస్‌బీ) తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
అరు వ్యాలీ: అందమైన ఈ పచ్చిక మైదానాన్ని చేరుకునేందుకు పర్వతం గుండా నడవాలి. గుర్‌ కుంభ్‌ వద్ద లిడ్డార్‌ నది అంతర్థానమవుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి 27 నిమిషాలు ప్రయాణిస్తే తిరిగి కనిపిస్తుంది.
లిడ్డార్‌వాట్‌: దట్టమైన అడవుల మధ్యలో అద్భుతమైన క్యాంపింగ్‌ సైట్‌ ఉండే ప్రాంతమే లిడ్డార్‌వాట్‌. సింధు లోయలో ట్రెక్కింగ్‌ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది.
బేతాబ్‌వ్యాలీ: సన్నీడియోల్‌, అమృతా సింగ్‌ నటించిన బేతాబ్‌ సినిమా షూటింగ్‌ ఇక్కడే జరిగింది. పర్వతాల మధ్య పచ్చని పచ్చిక బయళ్లతో ఉంటుంది. పహల్గాం నుంచి ఈ ప్రాంతానికి వెళ్లచ్చు. ప్రకృతిని ప్రేమించే వారికి ఇది చూడదగ్గ ప్రదేశం. స్నో లెపర్డ్‌, ఆసియాటిక్‌ బ్లాక్‌ బేర్‌, రెడ్‌ ఫాక్స్‌, హిమాలయన్‌ మస్క్‌ డీర్‌ వంటి అంతరించిపోయే ప్రమాదమున్న వన్యప్రాణులకు, అరుదైన జీవులకు ఈ ప్రాంతాన్ని నిలయంగా చెప్పుకోవచ్చు.
పహల్గాం జనాభా…
పహల్గాం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 9,264 మంది జనాభా ఉన్నట్లు 2011 భారత జనాభా లెక్కల రిపోర్టు పేర్కొంది. అయితే ఈ మధ్య కాలంలో 13,200 పెరిగి ఉంటుందని అంచనాలున్నాయి. అప్పటి జనాభా లెక్కల ప్రకారం.. పహల్గాంలో ముస్లిం జనాభా ఎక్కువ. ఆ తర్వాత హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైన్లు, ఇతర మతాల వారు ఉన్నారు.

  • సలీమ
    94900 99083
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -