రాహుల్ ప్రధానైతే 21 ఏండ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే హక్కు
రాజీవ్గాంధీ జయంతి సభలో సీఎం రేవంత్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశ యువతకు రాజీవ్గాంధీ గొప్ప స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని చెప్పారు. దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన తన ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. పారదర్శక పరిపాలన అందించేందుకు సాంకేతికతను జోడించాలంటూ ముందుగానే ఆయన ఆలోచన చేశారని తెలిపారు. 18 ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కును కల్పించి దేశ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం కల్పించారని కొనియాడారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకుని 21 ఏండ్లు నిండిన వారు శాసనసభకు పోటీ చేసేలా చట్టాన్ని సవరించేందుకు కృషి చేస్తామన్నారు. ఆ కలలన్నీ సాకారం కావాలంటే దేశానికి ఆయన ప్రధాని కావాలని సీఎం ఆకాంక్షించారు. బుధవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లను కల్పించిన దార్శనికుడన్నారు. కంప్యూటర్ను ఆయన దేశానికి పరిచయం చేశారని గుర్తు చేశారు. టెలికాం రంగంలో ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే ఆనాడు హైదరాబాద్లో హైటెక్ సిటీకి పునాది పడిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళతామన్నారు. సంక్షేమం, అభివృద్ధితోపాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపామని తెలిపారు. రాజీవ్గాంధీ స్ఫూర్తితో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే వరకు విశ్రమించబోమని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు వీహెచ్, అంజన్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మెన్లు, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు.
యువతకు రాజీవ్ గొప్ప స్ఫూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES