నవతెలంగాణ-హైదరాబాద్: మరాఠీలకు ప్రభుత్వ ఉద్యోగాలు, కాలేజీల్లో పదిశాతం ఓబిసి రిజర్వేషన్ కల్పించాలని మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్ గత ఐదురోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నారు. ముంబైలోని ఆజాద్ మైదాన్లో జరుగుతున్న ఈ నిరాహార దీక్షకు ముంబై పోలీసులు నిరాకరించారు. అయినప్పటికీ మనోజ్ పట్టువీడకుండా మరాఠీలకు ఓబిసి రిజర్వేషన్ కల్పించాలని ఆయన నిరాహారదీక్ష చేపట్టారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఓబిసి రిజర్వేషన్లపై ఏదో ఒక నిర్ణయం తీసుకునేంత వరకు తాను నిరాహార దీక్షను కొనసాగిస్తానని.. అక్కడి నుంచి కదలనని హెచ్చరించారు. ఈ నిరాహార దీక్ష చేపట్టడం వల్ల మనోజ్కి విపరీతంగా మద్దతు పెరుగుతోంది. ఆజాద్ మైదానానికి వందలాది మంది చేరుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో.. ఫడ్నవీస్ ప్రభుత్వం ఆందోళనకారుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆందోళనకారుల్ని ముంబైలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మనోజ్ ‘సోమవారం జరగబోయే అతిపెద్ద ప్రజా నిరసనను చూసి మీరు తట్టుకోలేరు. ఒకవేళ నేను చనిపోయినా.. ఇక్కడి నుంచి (ఆజాద్ మెదాన్) కదలను. నేను చనిపోయినా సరే.. మీరు(దేవేంద్రఫడ్నవీస్) మాత్రం మౌనంగా ఉండండి’ అని ఆ రాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ని హెచ్చరించారు.