ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తాహశీల్దార్ చందా నరేష్
నవతెలంగాణ – నెల్లికుదురు
తాజా వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ రోజు నుండి మూడు (3) రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి భద్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాహసిల్దార్ చందా నరేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడారు. అత్యవసర పరిస్థితులు తప్ప ఎవరూ బయటకు వెళ్లరాదు. చేపలు పట్టడానికి గాని, పశువులను తీసుకొని గాని చెరువులు, వాగులు, వంకల వద్దకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదు. పాత ఇళ్లు లేదా కూలిపోయే ప్రమాదం ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు తక్షణమే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలి. అవసరమైతే సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ పంచాయతీ భవనాలు లేదా స్థానికంగా ఏర్పాటు చేసిన షెల్టర్ లలో తాత్కాలికంగా ఆశ్రయం పొందవచ్చు.
అధికారులకు సూచనలు..
పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పరిపాలన అధికారులు తప్పనిసరిగా మండల ప్రధాన కార్యాలయం (హెడ్క్వార్టర్) లో ఉండి పర్యవేక్షణ చేపట్టాలి. సంబంధిత లైన్ డిపార్ట్మెంట్లు కూడా తమ సిబ్బందిని హెడ్క్వార్టర్లో ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలి.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పై సూచనలు ప్రజలకు తెలియజేయబడుతున్నవి. ప్రతి ఒక్కరూ సహకరించి భద్రతా చర్యలు తీసుకోవాలి. తహసిల్దార్ నరేష్ తెలిపారు.