నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం గరుడ వాహనసేవ నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో వాహనాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో అలిపిరిలో భారీ రద్దీ నెలకొంది. అలిపిరి టోల్గేట్ వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అనుమతిస్తున్నారు.
మరోవైపు తిరుమలలో భక్తులు రద్దీ అధికంగా ఉంది. శ్రీనివాసుడి గరుడ సేవను కనులారా వీక్షించేందుకు శనివారం రాత్రి నుంచే భక్తులు నిరీక్షిస్తున్నారు. పలువురు భక్తులు గ్యాలరీల్లోనే నిద్రించారు. గ్యాలరీల్లో ఉన్న భక్తులకు తితిదే సిబ్బంది పాలు, బిస్కెట్లు అందజేశారు. 4 మాడ వీధుల్లో పర్యవేక్షణకు 64 మంది ప్రత్యేక సిబ్బంది, 14 మంది ప్రత్యేక అధికారులను తితిదే నియమించింది.