నవతెలంగాణ-హైదరాబాద్: ‘నాకు ఈరోజు ఇంత గుర్తింపు రావడానికి కారణం చిరంజీవే’ అని ప్రభుదేవా అన్నారు. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా గుర్తింపు పొందారు ప్రభుదేవా. ఆయన డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, ఆయనకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నా ఆయన మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఫ్యానేనంటున్నారు. ఈ విషయాన్ని కొన్ని వందలసార్లు పెద్ద పెద్ద స్టేజెస్ పైన చెప్పారు ప్రభుదేవా.
తాజాగా ఆయన జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షో కి గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్బంగా ప్రభుదేవా మాట్లాడుతూ …. ” నాకు హిప్అప్, బ్రేక్ డ్యాన్స్ తెలియవు. నాకు నా డ్యాన్స్ మాత్రమే తెలుగు. సినిమా ఇండిస్టీ అనేది చాలా గొప్పది. చాలామందికి అవకాశాలు ఇస్తుంది. కానీ, నిలదొక్కుకోవాలంటే మాత్రం కష్టం తప్పదు. ఆ విషయంలో నాకు ఇండిస్టీలో చిరంజీవి ఆదర్శం. ఆయన కష్టాన్ని నేను కళ్లారా చూశాను. అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడు సినిమాలో మెరుపులా అనే సాంగ్కి నేనే కొరియోగ్రఫీ చేశాను. అప్పుడు ఆయన డ్యాన్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను. నాకు ఈరోజు ఇంత గుర్తింపు రావడానికి కారణం చిరంజీవే. టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించడంలో ఆయన ముందుంటారు. అలాగే నాకు కూడా అవకాశం ఇచ్చారు. అబ్బనీ తీయనిదెబ్బ సాంగ్ కొరియోగ్రఫీలో నాన్నతో పాటు నేనూ చేశాను. అప్పుడు నా వయసు 15 ఏళ్లు ” అంటూ చెప్పుకొచ్చారు ప్రభుదేవా. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.