నవతెలంగాణ-హైదరాబాద్: తాజాగా కుల వేధింపుల వల్ల హర్యానా దళిత ఐపిఎస్ అధికారి పురాన్ కుమార్ తనని తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య పాల్పడ్డారు. ఇటీవలి కాలంలో దళితులపై జరిగిన దాడుల ఘటనలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ప్రధాని మోడీ హయాంలో దళితులు, ఆదివాసీలపై నేరాలు పెరిగిపోతున్నాయని ఖర్గే తీవ్రంగా విమర్శించారు. సిజెఐపై చెప్పును విసరబోయిన ఘటన కానీ, రారుబరేలీలో దొంగ అనుకుని దళిత వ్యక్తిని కొట్టి చంపిన ఘటన కానీ, తాజాగా దళిత ఐపిఎస్ అధికారి పురాన్ కుమార్ ఆత్మహత్య కానీ పరిశీలిస్తే ఆర్ఎస్ఎస్ బీజేపీల ప్రమాదకరమైన ఫ్యూడల్ మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి అని శుక్రవారం ఎక్స్ పోస్టులో ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కాగా, నరేంద్ర మోడీ పాలనలో 2013 నుంచి 2023 వరకు ఆదివాసీలు, దళితులపై నేరాల శాతం పెరిగింది. దళితులపై 46 శాతం, ఆదివాసీలపై 91 శాతం నేరాలు పెరిగినట్లు ఎన్సిఆర్బి (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) నివేదిక తెలియజేసింది అని ఖర్గే ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. తాజాగా కులవివక్ష వల్ల ఐపిఎస్ అధికారి, వేధింపులతో రారుబరేలీలో హరిఓం వాల్మీకి, సిజెఐపై చెప్పుతో చేయబోయిన దాడి, గురువారం బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్ సవాయి మాధోపూర్ జిల్లాలో వృద్ధ దళిత మహిళ కమలాదేవి రారుగర్ తన కాళ్లకు ఉన్న వెండి చీలమండల్ని తీసుకోవడానికి ఆమెను దారుణంగా కొట్టినది గానీ ఇటీవల జరిగిన ఈ వరుస సంఘటనలన్నీ పరిశీలిస్తే కేవలం వేర్వేరు సంఘటనలు కాదు.. అవి ఆర్ఎస్ఎస్- బీజేపీ ఫ్యూడల్ మనస్తత్వం యొక్క ప్రమాదాన్ని తెలియజేస్తున్నాయి. ఈ సంఘటనలు భారత రాజ్యాంగంలోని సామాజిక న్యాయం, సమానత్వం అనే ప్రాథమిక సూత్రాలపై దాడిని ప్రతిబింబిస్తాయి. దళితులు, వెనుకబడిన తరగతులు, ఆదివాసీలు, అణగారిన వర్గాలను బెదిరించడం, అణచివేయడం వంటి రాజకీయాలు ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయి.
రాజ్యాంగం ద్వారానే భారతదేశం పరిపాలించబడుతుంది. తీవ్రవాద భావాజాలం యొక్క ఆదేశాల ద్వారా కాదు. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, బలహీన వర్గాలు ఆర్ఎస్ఎస్ బిజెపిల భావజాలంతో దాడులకు గురవుతున్నారు. వారెంతో నలిగిపోతున్నారు. మీరు (బిజెపి నేతలు) మీ సొంత కళ్లజోడు పెట్టుకుని.. అసలు సమస్యల్ని చూడలేకపోతున్నారు అని ఖర్గే ఎక్స్ పోస్టులో ఆర్ఎస్ఎస్ బిజెపిలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.