రోడ్డు ప్రమాదాల నివారణ బాధ్యత ప్రభుత్వాలదే
డ్రైవర్లకు పదేండ్ల జైలు నిబంధన రద్దు చేయాలి : పీపీఆర్టీడబ్ల్యూఎఫ్ 4వ మహాసభలో ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి జీవన్సాహు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి జీవన్ సాహు డిమాండ్ చేశారు. ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పబ్లిక్ అండ్ ప్రయివేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (పీపీఆర్టీడబ్ల్యూఎఫ్) 4వ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ వీరయ్య అధ్యక్షత జరిగింది. దీనికి జీవన్ సాహు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. స్థూల జాతీయోత్పత్తిలో రవాణారంగ కార్మికుల పోషిస్తున్న పాత్ర చాలా గొప్పదని చెప్పారు. కానీ పాలకులు ఆ రంగం కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో లెక్కల ప్రకారం గత ఏడాది 31 వేల మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారని చెప్పారు. వీటిని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత 106(2) చట్టం ప్రకారం డ్రైవర్లకు పదేండ్ల జైలు శిక్ష విధించడం అన్యాయమన్నారు. ఆ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు మాట్లాడుతూ రవాణారంగంలో ఐదుకోట్లమందికి పైగా పనిచేస్తున్నారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు చేసేలా ఇన్సూరెన్స్ పాలసీ పథకాలను తీసుకువచ్చిందని విమర్శించారు. పీపీఆర్టీడబ్ల్యూఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ వీరయ్య, పుప్పాల శ్రీకాంత్ మాట్లాడుతూ చమురు ధరలు తగ్గించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు. నిత్యావసర ధరల్ని నియంత్రించడంలో ఎన్డీఏ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కార్మిక చట్టాలు రద్దుచేసి, నాలుగు లేబర్ కోడ్లు తెచ్చి, పని గంటలు పెంచి ప్రజలను, కార్మికులను పీడిస్తున్నదని చెప్పారు. మహాసభల ప్రారంభంలో ఎస్ వీరయ్య జెండా ఎగురేశారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు, శాసన మండలి మాజీ సభ్యులు నర్సిరెడ్డి ఆహ్వానం పలికారు. మహాసభలో టీజీఎస్ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ అధ్యక్షులు వీరాంజనేయులు, ఆఫీస్ బేరర్స్ అజరుబాబు, ఉపేందర్, కల్లూరి మల్లేశం, విక్రమ్, పాషా, కోటయ్య, రామదాసు, విజయేందర్, రవికుమార్, రాము, రుద్రకుమార్, సాయిలు, లక్ష్మీ నారాయణ, రాంబాబు, రామయ్య, రాములు , సీఐటీయూ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు కుమార్, ఎం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.