టీడీసీఏ అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి
హెచ్సీఏకు వ్యతిరేకంగా జింఖానా గ్రౌండ్ వద్ద మెరుపు ధర్నా
హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో జరిగిన రూ.68.73 కోట్ల భారీ నిధుల గోల్మాల్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, విశాఖ ఇండస్ట్రీస్ నుంచి సొమ్మును వెనక్కి తీసుకుని గ్రామీణ క్రికెట్ అభివృద్దికి ఖర్చు చేయాలని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) అధ్యక్షుడు, మాజీ స్పోర్ట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రూ. 4 కోట్ల ఇచ్చి.. రూ.68.73 కోట్లు కొల్లగొట్టిన దొంగల ముఠాను హెచ్సీఏ నుంచి తరిమికొట్టాలని అల్లీపురం అన్నారు. మంగళవారం జింఖానా గ్రౌండ్లో హెచ్సీఏ అధ్యక్షుడి సమావేశం జరుగుతున్న సమయంలో.. అల్లీపురం ఆధ్వర్యంలో టీడీసీఏ శ్రేణులు మెరుపు ధర్నాకు దిగాయి. హెచ్సీఏ నిధులు వెనక్కి రాకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా టీడీసీఏ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
శేషు నారాయణ ఫైర్
హెచ్సీఏ మీడియా సమావేశం గురించి ప్రెస్ ఇన్విటేషన్ను గత ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఓడిన అనిల్ కుమార్ పంపించారు.హెచ్సీఏలో ఏ హోదాలో అనిల్కుమార్ ప్రెస్మీట్ ఇన్విటేషన్ పంపించారు? హెచ్సీఏ ప్రెస్మీట్లో అనిల్ ఎందుకు ఉన్నారు? అంటూ మాజీ కార్యదర్శి శేషు నారాయణ ఫైర్ అయ్యారు. గత ఎన్నికల్లో మంత్రి వివేక్ మద్దతుతో అనిల్కుమార్ హెచ్సీఏ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిన సంగతి తెలిసిందే.



