Sunday, June 8, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిబడికి బాట పడుతుందా!

బడికి బాట పడుతుందా!

- Advertisement -

దశాబ్దాలుగా బడికి బాటలు వేయాలని హోరెత్తే నినాదాలతో, కార్యక్రమాలతో, ప్రచారాలతో ముందుకుపోతున్నా, ప్రభుత్వ బడులు కళకళలాడడంలేదనేది చేదైన విషయం. దీని ఫలితం సమాజంపైనా, భవితపైనా తీవ్రంగానే పడుతోంది. ప్రభుత్వ బడులు కళకళలాడడం అటుంచి, మూతపడి కనుమరుగవటం పెద్ద విషాదం. పెరుగుతున్న జనాభా ప్రకారం పెరగాల్సిన బడులు, ప్రభుత్వంలో మాత్రం తగ్గుతుంటే… ప్రయివేటు వ్యాపార పాఠశాలలు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల మానసిక ఆలోచనల్లో ప్రవర్తనల్లోనే పెద్ద మార్పు వచ్చింది. మానవ సంబంధాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని కలుగచేసింది. కొనడం, అమ్మడం విలువల ఆధారంగానే మనుషుల మధ్య సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఇది మనకు కనపడకుండా జరిగే మార్పు. ఇక బాధ్యత వహించాల్సిన ప్రభుత్వాలూ చేతులెత్తేయటం, భవిష్యత్‌ తరాలను తీర్చిదిద్దటంలో సమాజానికి బాధ్యత లేకపోవడం మూలాన అనేక అనర్థాలు పరిణమిస్తున్నాయి. ఇది లోతుగా ఆలోచించినపుడే బోదపడుతుంది.
ఇప్పుడవేవీ ఆలోచించే స్థితిలో ప్రభుత్వాలు లేవు. అయితే ప్రజలు, పౌరసమాజమూ అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరింత అనర్థం ఎదురవుతుంది. మానవ వనరులను మానవీయ మార్గంలో నైపుణ్యవంతంగా తీర్చడం, విలువల ప్రాతిపదికన అభివృద్ధి పరచడం అనేది ప్రభుత్వ ఆధీనంలోనే జరగాలి. జరుగుతుంది కూడా. కానీ ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి. ప్రయివేటుకు ఊడిగం చేసే వ్యవస్థగా అదీ మారిపోయింది. అందుకనే కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు విద్యావ్యాపారానికి అనుకూల నిర్ణయాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమూ ప్రయివేటునే పెంచి పోషిస్తున్నది. విచ్చలవిడిగా ప్రయివేటు పాఠశాలలకు అనుమతులిస్తున్నారు. పాఠశాల నిర్వహణా ప్రమాణాలేవీ పట్టించుకోకుండానే ప్రయివేటు బళ్లు నడుస్తున్నాయి. కేవలం ఫలితాలు ఆధారంగానే బేరీజు వేస్తున్నారు. అయితే ఇందులో ప్రభుత్వ బడుల వైఫల్యమూ వుంది. దీనికి సవాలక్ష కారణాలున్నాయి. ‘దేశభవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంద’ని కొఠారి కమీషన్‌ చెప్పిన విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి కనీసంగా పదిశాతం నిధులు కేటాయించాలన్నదీ పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలూ విద్యపట్ల అంతే నిర్లక్ష్యంగా ఉన్నాయి. మారుతున్న అవసరాలకనుగుణంగా విద్యా వ్యవస్థను మలచుకోవడంలో విఫలమవుతున్నాయి. ప్రభుత్వ బడులకు సౌకర్యాలు, వసతులు కల్పించడంలోనూ పెద్ద లోపాలున్నాయి. ఆడపిల్లలకు అన్ని పాఠశాలల్లో మూత్రశాలలు లేవు. తరగతికొక గదిని, గదికొక ఉపాధ్యాయున్ని, పర్యవేక్షకులను ఏర్పాటు చేసుకోలేకపోయాము. ఆవాసాలకు అందుబాటులో పాఠశాలల్ని నిర్మించడం అటుంచి, విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో ఉన్నవాటినే మూసేస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు, ప్రభుత్వ బడులకు మధ్య అగాధం పెరుగుతోంది. విద్యార్థికి పాఠశాలను దూరంగా నెడుతున్నారు.
విద్యా విలువను గ్రహించిన సామాన్య ప్రజలు కూడా ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ వైద్యశాలలో నాణ్యత ఉండదనే అభిప్రాయంలోకి వచ్చారు. పేదరికంలో ఉన్న ప్రజలు కూడా తమ జీవితాలనూ తాకట్టు పెట్టి మరీ ప్రయివేటువైపు మొగ్గు చూపుతున్నారు. రంగురంగుల భ్రమలు, ఆంగ్ల మోజు ఆకర్షణకు గురిచేస్తున్నది. పేదలను ఫీజుల భారం మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతంలో పేద సామాన్య ప్రజలు ప్రభుత్వ బడులనే ఆశ్రయిస్తున్నారు. 26,106 ప్రభుత్వ పాఠశాలలలో దాదాపు 17 లక్షల మంది విద్యార్థులు నమోదై ఉన్నారని తెలుస్తున్నది. అసలు విద్యార్థాలే చేరని పాఠశాలలూ వందల సంఖ్యలో ఉన్నాయని, వాటిని మూసివేసే ప్రమాదముందని తెలుస్తున్నది. బడులను మెరుగుపరచాలి. నాణ్యమైన విద్య దొరుకుతుం దనే విశ్వాసాన్ని తల్లిదండ్రులలో కలుగచేయాలి. ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలపైన కూడా ఉంది. అంతేకాదు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కీలక భాగస్వా ములుగా ఉన్న ఉపాధ్యాయులపై మరింత ఎక్కువ బాధ్యత ఉంది.
ప్రొ|| జయశంకర్‌ గారి పేరు మీద నడుపుతున్న బడిబాట కార్యక్రమం కేవలం కార్యక్రమంగా కాకుండా బడి బయట ఉన్న పిల్లలను, డ్రాపౌట్స్‌ను, ప్రభుత్వ బడిలోకి చేర్పించే పనిని ప్రభుత్వం, అధికారులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, ప్రజలు ఉమ్మడిగా నిబద్ధతతో చేపట్టాలి. ప్రాథమిక పాఠశాలలలో ప్రీప్రైమరీ తరగతులు నిర్వహించాలి. ఆకర్షణీయ బోధనా పద్ధతులతో ఆధునిక విధానాలతో తరగతుల నిర్వహణలో బడులు సాగినపుడు ప్రభుత్వ బడులు కళకళలాడుతాయి. ప్రభుత్వాలూ చిత్తశుద్ధితో కృషి చేసినపుడే బడిబాట లక్ష్యం నెరవేరుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -