గత పదకొండేండ్ల నుంచి దేశంలో ఒక విపరీతమైన ధోరణి చోటు చేసుకుంటోంది. 2014లో మోడీ నేతత్వంలోని బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఈ ధోరణికి బీజాలు పడ్డాయి. అసలైన సమస్యల నుంచి, ఈతి బాధల నుంచి, వాటి పోరాటాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించటం, అందుకు వీలుగా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడటం బీజేపీకి ఆనవాయితీగా మారింది. మతాన్ని రాజకీయాల్లోకి జొప్పించటం ద్వారా ఎన్నికల్లో లబ్దిపొందడం మోడీకే చెల్లుతుంది. తనకు అవసరమైనప్పుడల్లా మత విద్వేషాలను రెచ్చగొట్టటం, మత ఉద్రిక్తతలకు పాల్పడటం రివాజుగా మారింది. అందుకు పుల్వామా ఘటనతోపాటు అనేకానేక ఉదాహరణలున్నాయి. నేడు ఆ జాబితాలోకి పహల్గాం ఘటన కూడా చేరింది.
గత ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై టెర్రరిస్టులు దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దుర్మార్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. టెర్రరిస్టులపై కఠినచర్యలు తీసుకోవాలన్న విపక్షాల విజ్ఞప్తిని సైతం పెడచెవిన పెట్టింది. పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచి పహల్గాం ఘటన పూర్వాపరాలు తెలియజేయాల్సిన కేంద్రం అందుకు సిద్ధంగా లేదు. కానీ, దీనిని కూడా బీహర్ ఎన్నికల అంశంగా మార్చుకుంటుందన్న విషయం బీహర్లో ప్రధాని మోడీ ప్రసంగం చూస్తే స్పష్టమవుతున్నది. టెర్రరిస్టులను ప్రతిఘటిస్తూ తుపాకులు గుంజుకునే ప్రయత్నంలో స్థానిక ముస్లిం కూడా మరణించాడనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మతి చెందిన పర్యాటకుల కుటుంబాలకు ఆసరాగా నిలిచి వారికి మనోధైర్యాన్ని కల్పించిన వాళ్లు కూడా స్థానిక ముస్లింలే కావడం గమనార్హం. టెర్రరిస్టుల చర్యల వల్ల పర్యాటకుల రాకపోకలకు అంతరాయం కలిగితే, టూరిజం మీదనే ఆధారపడిన తాము ఉపాధిని కోల్పోతామని ఆ రంగంలో సేవలందిస్తున్న స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెర్రరిస్టు చర్యలను వారు నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఘటనకు కొద్ది నెలల ముందు ఆ ప్రాంతంలో పహారా ఉండే కేంద్ర రిజర్వ్ దళాలను అక్కడి నుంచి వెనుకకు పిలిపించడం వెనుక వున్న అంతర్యం ఏమిటో చెప్పాల్సిన బాధ్యత కేంద్రపాలకులపై ఉంది.
వాస్తవం ఇలా ఉండగా, దీన్ని బీజేపీకి లబ్ది చేకూర్చే ఘట్టంగా చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్న ప్రధాని … భవిష్యత్తులో టెర్రరిస్టుల కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై ఆయా పార్టీలు, ఎంపీల అభిప్రాయాలు వినేందుకు కూడా సిద్ధంగా లేకపోవడం శోచనీయం. ఆపరేషన్ సిందూర్ పేరుతో జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో టెర్రరిస్టు స్థావరాల మీద మన సైన్యం నాలుగు రోజులపాటు దాడులు చేసింది. ఈ సందర్భంగా, మన దేశం గుండా పాకిస్తాన్కు ప్రవహించే నది జలాలను నిలిపివేస్తున్నట్టు, ఆ దేశ వైమానిక స్థావరాలపై, కరాచీ ఓడ రేవుపై ధీటుగా ప్రతి దాడులు చేసినట్టు మోడీ మీడియా ఊహలను అద్భుతమైన గ్రాఫిక్స్తో త్రీడీ పిక్చర్లను చూపించాయి. మరోవైపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ను తిరిగి భారత్లో కలుపుకోవడం ఖాయమని వాట్సాప్ యూనివర్సిటీ పండితులూ, వారి శిష్య బందాలు యుద్ధానికి మతం రంగు పులిమి మరీ విద్వేష వ్యాఖ్యలు – వార్తలను సోషల్ మీడియాను నింపేశారు. పహల్గాం ఘటనలో తమ వారిని కోల్పోయిన ఇద్దరు మహిళలు ఆ ఘటనకు మత కోణాన్ని నిరాకరించడంతో, వారి పట్ల సామాజిక మాధ్యమాల్లో అనాగరికంగా వార్తలను ట్రోల్ చేశారు.
మరోవైపు ఆపరేషన్ సింధూర్కు నేతృత్వం వహించిన కల్నల్ సోఫియా ఖురేషి మతాన్ని ఎత్తిచూపుతూ మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజరుషా బహిరంగంగానే నోరు పారేసుకున్నారు. అయినా ఆయన మీద బీజేపీ ఎలాంటి చర్య తీసుకోకపోవటం విస్మయకరం. విజరుషా వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆయన మీద కేసు నమోదు చేసింది. అయినా పాఠాలు నేర్వని బీజేపీ శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా పహల్గామ్ ఘటన ద్వారా ఆయా రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది. నిజానికి ఆపరేషన్ సిందూర్ కోసం త్రివిధ దళాల భారత సైన్యాలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి యుద్ధానికి సిద్ధ మయ్యాయి. దీన్ని కూడా స్వీయ ప్రయోజనానికి వాడుకోవడానికి మోడీ తహతహలాడుతున్నారు. భారత సైనిక దళాల ప్రతిభాపాటవాలు ఏ ఒక్కరికీ చెందవు. ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం ఉపయోగించిన క్షిపణులు, సాంకేతికత పూర్తిగా భారత ప్రజల సొమ్ముతో 30 ఏండ్ల క్రితం రూపొందించినదే కాని మోడీ హయాంలో రూపొందింది కాదు.
ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించిన నాలుగు రోజుల తర్వాత, భారత ప్రధాని కంటే ముందే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాము ఇరు దేశాల(భారత్, పాక్)తో మధ్యవర్తిత్వం జరిపామని, భారత్ పాక్ల యుద్ధం ముగిసిందని ప్రపంచానికి వెల్లడించారు. ఇరు దేశాలు సంప్రదింపులు జరుపుతాయని కూడా ఆయనే ప్రకటించటం గమనార్హం. మూడో పక్షం ఇలాంటి ప్రకటన చేయడం ఈ దశాబ్దపు విషాదం. యుద్ధ వాతావరణం ఆరంభం నుంచే వివిధ దేశాలు పరస్పర సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చేసిన హితవును , భారత్- పాక్లు పెడచెవిన పెట్టాయి. పనిలో పనిగా ఆయన మద్దతుతోనే పాకిస్తాన్ ప్రపంచ బ్యాంక్ నుంచి లక్షకోట్ల రూపాయల రుణం అందింది. అయితే ఇప్పటికీ పహల్గాం పర్యాటకుల హత్యాకాండకు కారకులైన నలుగురు టెర్రరిస్టులను పట్టుకోలేదు. కనీసం వారి ఆచూకీ కూడ కనిపెట్టలేదు. కానీ ఈ ఉద్రిక్త వాతావరణాన్ని ఇప్పటికీ రెచ్చగొడుతూ… భారత ప్రజల మధ్య పొరపొచ్చాలు తీసుకొచ్చేందుకు, మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ చాలా చక్కగా వినియోగించుకుంటోంది. ఇది దేశానికి, ప్రజలకు అత్యంత ప్రమాదకరం. యుద్ధమనేది దేనికీ పరిష్కారం కాదు, దాని నివారణ చర్యలే ఇటు అభివద్ధికి, అటు శాంతికి మూల కారణమన్న సంగతి సుస్పష్టం. అందుకు అనేక ఉదాహరణ లున్నాయి.
దేశంలో ఫెడరల్ విధానాన్ని, సెక్యులర్ తత్వాన్ని దెబ్బ తీయడానికి, తమ పార్టీ, కూటమి తప్ప వేరొకరు అధికారంలో ఉండకూడదనే ఉద్దేశంతో బీజేపీ తన రాజకీయాలను నడుపుతోంది. రాష్ట్రాల అధికారాల్లో మితిమీరి జోక్యం చేసుకోవడానికి వీలుగా గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తోంది. అందుకు తమిళనాడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ బిల్లులను తొక్కి పెట్టిన తీరే ప్రత్యక్ష నిదర్శనం. ఈ స్థితిలో అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి, కేంద్ర ప్రభుత్వ ఈ నియంతత్వ పోకడలను సుప్రీంకోర్టు అడ్డుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన నిష్పాక్షిక తీర్పుల పట్ల, బీజేపీి మంత్రుల అసహనం ఆ పార్టీ నిరంకుశ పోకడలకు అద్దం పడుతోంది. దేశంలో ప్రధాన సమస్యల నుంచి ప్రజల దష్టి మళ్లించేందుకు కేంద్ర పాలకులు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మైనింగ్ కోసం అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న ఆదివాసీలను బయటకు పంపించి, ఆ ప్రాంతాలను ప్రయివేటు, కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ గ్రీన్హంట్, ఆపరేషన్ కగార్ పేరు మీద ఆదివాసీ జనావాసాల మీద జరిపిన యుద్ధకాండలో 400 మంది ఆదివాసీలు, మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. చర్చలకు తాము సిద్ధమని ప్రకటించిన తర్వాత కూడా మావోయిస్టుల మీద ఏకపక్షంగా కాల్పులు కొనసాగాయి. పాకిస్తాన్తో కాల్పుల విరమణకు ఒప్పుకున్న మోడీ మావోయిస్టులతో చర్చలకు మాత్రం ఎందుకు వెనుకాడుతున్నారో చెప్పాలి.
ప్రజల ఆర్థిక స్వాలంబనను, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా కార్పొరేట్ శక్తుల అనుకూల విధా నాలను అనుసరించడం వల్ల ప్రస్తుతం దేశంలోని అన్ని వర్గాల ప్రజలు జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నారు. రైతుల శ్రమను కార్పొరేట్ పరం చేసేందుకు లోగడ మూడు రైతు చట్టాల్ని ప్రవేశపెట్టారు. రైతుల సుధీర్ఘ ఆందోళనలు, బలిదానాలతో వాటిని వెనక్కి తీసుకున్న కేంద్రం దొడ్డిదారిన వాటిని తీసుకువచ్చి రైతాంగాన్ని బలిచేసే ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు మన దేశ పారిశ్రామిక వేత్తలు వారానికి 80 నుంచి 90 గంటలు పని చేయాలంటూ కూనిరాగాలు తీస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించే ప్రయత్నాల్లో ఉంది. ‘ఒకే దేశం-ఒకే భాష’ పేరుమీద బలవంతంగా హిందీని రుద్దేందుకు, ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంటూ ప్రాంతీయ పార్టీలను, తమ ప్రత్యర్థి పక్షాలను దెబ్బకొట్టేందుకు కుట్రలు పన్నుతోంది. పార్లమెంటు స్థానాల పునర్విభజనతో తమకు అనుకూలంగా లేని దక్షిణాది రాష్ట్రాల ప్రజాభిప్రాయాన్ని అధిగమించడానికి, ఉత్తరాది రాష్ట్రాలలో పెద్ద ఎత్తున పార్లమెంట్ స్థానాల సంఖ్యను మరింత పెంచుకోవడానికి ప్రధాని మోడీ, బీజేపీ నాయకత్వం దురాలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సమస్త వర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES