Monday, June 2, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురూ.లక్షలోపే వికాసం!

రూ.లక్షలోపే వికాసం!

- Advertisement -

– అత్యధికంగా రూ.50వేల పెట్టుబడి యూనిట్లే..!
– రూ.లక్షకు పైబడితే ఇప్పట్లో వచ్చేది అనుమానమే..!
– అధికారుల సూచనలతో రూ.లక్షలోపునకు
– కుదించుకున్న దరఖాస్తుదారులు
– లబ్దిదారుల సంఖ్య పెంచి చూపేందుకేనని విమర్శలు
– యువ వికాసంలోనూ మితిమీరిన రాజకీయ జోక్యం
– రేపే యూనిట్ల మంజూరు పత్రాలు పంపిణీ
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

కాంగ్రెస్‌ ప్రభుత్వం జూన్‌ 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించే పథకాల్లో రాజీవ్‌ యువ వికాసం అత్యంత కీలకమైనది. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రూ.4 లక్షల లోపు యూనిట్ల మంజూరుకు దరఖాస్తులు స్వీకరించినా సోమవారం రూ.లక్షలోపు యూనిట్లకే మంజూరు పత్రాలు అందజేస్తారని తెలుస్తోంది. దీనిలోనూ అత్యధికంగా రూ.50వేలలోపు యూనిట్లే ఉన్నాయని అంటున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల రీత్యా రూ.లక్షకు పైబడిన యూనిట్లు మంజూరు కావటం కష్టమేననే ప్రచారాన్ని అధికారుల ద్వారా ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. రూ.లక్షకు పైబడిన యూనిట్లకు అప్లై చేసుకున్నవారు దరఖాస్తులను మార్చుకునే అవకాశం కూడా కల్పించింది. ఈ మేరకు ఎంపీడీవో, మున్సిపల్‌ ఆఫీసుల్లో రూ.లక్షకు పైబడిన యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న పలువురు అప్లికేషన్‌లను సవరించుకున్నారు. యూనిట్ల విలువ తగ్గించుకోవటం వల్ల్ల ప్రభుత్వంపై ఆర్థికభారం తగ్గటంతో పాటు ఎక్కువ మందికి లబ్ది చేకూర్చామని చూపించుకోవచ్చనే వ్యూహం దీనిలో దాగివున్నట్టు ప్రతిపక్ష పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికితోడు ఈ పథకంలోనూ మితిమీరిన రాజకీయజోక్యం జరుగుతోందని లబ్దిదారులు వాపోతున్నారు.
తొలి విడత లక్ష మందికి మాత్రమే…
రాజీవ్‌ యువ వికాసం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో జూన్‌ 2వ తేదీన లక్ష మంది అర్హులకు మాత్రమే యూనిట్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా రూ.50వేలు లేదా రూ.లక్షలోపు మంజూరైన యూనిట్లకు ప్రొసీడింగ్స్‌ ఇస్తారు. 9వ తేదీ వరకు వీటి ప్రోసిడింగ్స్‌ కొనసాగుతాయి. 10 నుంచి 15వ తేదీ వరకు లబ్దిదారులకు శిక్షణ ఇస్తారు. 16వ తేదీ నుంచి యూనిట్ల ప్రారంభోత్సవాలు ఉంటాయి. ఆ తర్వాత రూ.1-2 లక్షలు, చివరగా రూ.2-4 లక్షల యూనిట్లు మంజూరు చేస్తారని భావిస్తున్నారు. సెప్టెంబర్‌ నాటికి రూ.4 లక్షలలోపు యూనిట్లు మంజూరు అవుతాయని అంటున్నా…కొద్దిమందికి మాత్రమే వీటిని పంపిణీ చేస్తారనే చర్చ నడుస్తోంది.
ఈ పథకానికి 16 లక్షలకుపైగా దరఖాస్తులు రాగా లక్ష్యం మేరకు 5 లక్షల మంది అర్హులను మాత్రమే ఎంపిక చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు ఇటీవల కలెక్టర్లు, ఆయా సంక్షేమ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో సూచించారు. ఎక్కువగా కిరాణా, స్టేషనరీ షాపుల కోసం దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత పాడి పరిశ్రమ కోసం దరఖాస్తులు చేశారు. గ్రామాల్లో ఉన్న కిరాణషాపులు, డెయిరీ ఫాలను దృష్టిలో ఉంచుకొని యూనిట్లు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఉపాధి నిమిత్తం ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని పలువురు కోరారు. ఈ మేరకు అవకాశం కల్పించా ల్సిందిగా డిప్యూటీ సీఎం ఆదేశించారు. కిరాణాలు ఎక్కువగా ఉన్న చోట స్టేషనరీ, బ్యాంగిల్‌ స్టోర్స్‌, ఫ్యాన్సీ స్టోర్స్‌ లాంటివి ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు.

మితిమీరిన రాజకీయ జోక్యం!
ఇందిరమ్మ ఇండ్లు, ఇతరత్ర పథకాల తరహాలోనే రాజీవ్‌ యువ వికాసంలోనూ మితిమీరిన రాజకీయ జోక్యం చోటుచేసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రచారం ఉంది. దీనిలోనూ గత ప్రభుత్వంలో బీఆర్‌ఎస్‌లో ఉండి…ఇప్పుడు అధికార మార్పిడి దృష్ట్యా కాంగ్రెస్‌లో చేరిన వారికే పలు జిల్లాల్లో లబ్ది చేకూరుతున్నట్టు తెలుస్తోంది. దరఖాస్తుల స్వీకరణ వరకే అధికారుల చేతిలో ఉన్నా ఎంపిక తంతు పూర్తిగా నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా ఇన్‌చార్జి మంత్రి చేతుల్లో ఉండటంతో అధికార పార్టీకి చెందిన వారికే లబ్ది చేకూరే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -