నవతెలంగాణ – భీంగల్
ప్రభుత్వ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని 1వ, 2వ, 3వ, 4వ, 5వ, 6వ వార్డుల్లో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయా వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మహిళలకు మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ హాజరయ్యారు. 1వ వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు, 2వ వార్డు కౌన్సిలర్ పర్స కుశలత అనంతరావు, 3వ వార్డు కౌన్సిలర్ తోట సతీష్, 4వ వార్డు కౌన్సిలర్ గుణాల బాలలక్ష్మి, 5వ వార్డు కౌన్సిలర్ లావణ్య నర్యయ్య పాల్గొని మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు. పట్టణంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు వనమహోత్సవ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుని భీంగల్ పట్టణాన్ని పచ్చదనంతో నింపాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.



