నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం నస్తురుపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం కారుచిచ్చు అంటుకొని భారీగా మంటలు చెలరేగాయి. మహాదేవపూర్ రేంజ్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనతో అడవిలో ఉన్న పచ్చని చెట్లు, పొదలు మంటల్లో చిక్కుకొని బూడిదవుతున్నాయి. ఎండలు తీవ్రంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. సిబ్బంది ఫైర్ లైన్లు ఏర్పాటు చేసి, ఆకులు, పొదలను తొలగిస్తూ మంటల వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైన చోట్ల నీటి ట్యాంకర్ల సహాయంతో అగ్నిమాపక చర్యలు కొనసాగిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, కారుచిచ్చు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎండల కారణంగా సహజసిద్ధంగా మంటలు అంటుకున్నాయా లేదా ఇతర కారణాలున్నాయా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతాల్లో ఎవరూ నిర్లక్ష్యంగా మంటలు వేయకూడదని, పొగ త్రాగిన తరువాత సిగరెట్ ముక్కలు పడేయకూడదని అటవీశాఖ అధికారులు ప్రజలకు సూచించారు.



