కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నల్లమోతు భాస్కర్రావు
నవతెలంగాణ- నల్లగొండ టౌన్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్టేషన్ పెరిగిపోతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడి నల్లగొండలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలు జమీల్, మస్తాన్ను ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, కంచర్ల భూపాల్ రెడ్డి, తిప్పన విజయసింహరెడ్డి, యువ నేత నల్లమోతు సిద్దార్థ, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డితో కలిసి గురువారం ఆయన పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్బంగా జగదీశ్రెడ్డి, జూలకంటి మాట్లాడుతూ.. మిర్యాలగూడలో కాంగ్రెస్ తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకు భౌతిక దాడులకు పాల్పడ్డారన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట ఇలా చాలా చోట్ల దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారని తెలిపారు. కాంగ్రెస్ దాడులను బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిఘటించే ప్రయత్నం చేసారన్నారు. ఎన్నికల్లో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా మారారని, జిల్లా పోలీస్ అధికారులు నిస్సహాయులుగా మారారని ఆరోపించారు. ఎన్నికల సంఘం కూడా తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ బ్రాంచ్గా మారిందని, ఇతర పార్టీల ఫిర్యాదులపై స్పందించడం లేదని విమర్శించారు. ప్రతిచోటా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎన్నికల బూత్లు అక్రమించే ప్రయత్నం చేస్తే ఎన్నికల అధికారులకు కనీసం పట్టింపు లేదన్నారు. డబ్బు, అధికారం విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తూ గెలవాలని కుట్రలు చేశారని తెలిపారు. మిర్యాలగూడలో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్కు ఇవే చివరి ఎన్నికలు కాబట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పతనం మొదలైంది అనే దానికి భౌతిక దాడులే నిదర్శనమని తెలిపారు.



