నవతెలంగాణ – హైదరాబాద్ : ఏపీలోని కదిరి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బత్తలపల్లి తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ యువతీ యువకుడిపై విద్యుత్ తీగలు తెగిపడటంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఫయాజ్ అనే యువకుడు ఓ యువతితో కలిసి ఏకాంతంగా గడిపేందుకు సమీపంలోని అడవిలోకి వెళ్లారు. అదే సమయంలో ప్రమాదవశాత్తు పైనుంచి విద్యుత్ తీగలు తెగి వారిపై పడ్డాయి. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యుత్ షాక్కు గురైన యువతి గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో గొర్రెలు మేపుతున్న కాపరులు అప్రమత్తమయ్యారు.
వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం గొర్రెల కాపరుల సహాయంతో గాయపడిన యువతి, యువకుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది.



