నవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణంలోని 22 వార్డులలో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎం) పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ.. పట్టణంలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధానంగా రెండో వార్డులో గత మూడు సంవత్సరాల క్రితం రోడ్డు కోసం కంకర పోసి వదిలేసి, నేటికీ ఆ రహదారి నిర్మాణం పూర్తి కాలేదని ఆయన పేర్కొన్నారు. సరైన రోడ్డు సౌకర్యం లేక స్థానికులు నిత్యం అవస్థలు పడుతున్నారని, అలాగే వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో అపరిశుభ్రత పెరిగిందని ఆయన వివరించారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి, వెంటనే రెండో వార్డులో రోడ్డు మరియు డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని కళ్యాణ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ నాయకులు బొచ్చు ఈశ్వర్, బొజ్జ హేమంత్, సన్నీ, పవన్ తదితరులు పాల్గొన్నారు.



