– ఫీజు చెక్కులను పంపిణీ చేసిన కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పేద విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసా కల్పిస్తూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు అండగా నిలిచారు. బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన 16 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు వారి విద్యా సంవత్సరం ఫీజుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) బుధవారం హైదరాబాద్లో ఫీజు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు శుభాకాంక్షలు చెప్పారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, సమాజంలోని పేద విద్యార్థులు వైద్యులుగా ఎదిగేందుకు తన వంతు సహకారాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని అభినందించారు. ఏటా అనేక మంది విద్యార్థులకు విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సాయం చేస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న లక్ష్మారెడ్డి సేవా దృక్పథం అందరికీ ఆదర్శనీయమని చెప్పారు. బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతోనే ‘బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. వైద్య విద్య అభ్యసించే విద్యార్థులకు ఫీజుల భారం కలగకుండా చూస్తామనీ, వారు భవిష్యత్తులో గొప్ప వైద్యులుగా మారి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 16 మంది వైద్య విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, తమ చదువుకు అండగా నిలిచిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఎంబీబీఎస్ విద్యార్థులకు అండగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



