క్షమాపణ చెప్పిన అమోల్ మిట్కారి
ఐపీఎస్ అధికారిణిపై ట్వీట్ ఉపసంహరణ
ముంబయి : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో జరిగిన వివాదంలో ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణకు వ్యతిరేకంగా చేసిన ట్వీట్ను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్సీ అమోల్ మిట్కారి శనివారం ఉపసంహరించు కున్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానంటూ ఆమెకు క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు. యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఆమె విద్యార్హత, కుల ధృవీకరణ పత్రాలను చూపాలంటూ ఆయన అంతకుముందు ప్రశ్నించారు. ”ఇదేమీ పార్టీ వైఖరి కాదు. నా వ్యక్తిగత అభిప్రాయం. నిజాయితీగా సేవలందించే మన పోలీసు బలగాలు, అధికారుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది. పార్టీ సీనియర్ నాయకత్వం తీసుకున్న వైఖరితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.” అంటూ మిట్కారి శనివారం ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అక్రమంగా సాగుతున్న ఇసుక తవ్వకాలను ఆపేందుకు వెళ్ళిన ఆమెపై రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ తీవ్రంగా విరుచుకుపడిన విషయం విదితమే. దీనిపై వివాదం రేగి, ఆ వీడియో వైరల్ కావడంతో శుక్రవారం పవార్ స్పందించారు. అక్రమ ఇసుక తవ్వకాల్లో జోక్యం చేసుకోవాలన్నది తన ఉద్దేశ్యం కాదని, అక్కడ ఉద్రిక్తత పెచ్చరిల్లకుండా చేయడానికి ప్రయత్నించానని చెప్పారు. అయితే అంజనా కృష్ణ సర్టిఫికెట్లపై యూపీఎస్సీ నుంచి తాను సమాచారం తెలుసుకున్నానంటూ ఈలోగా మిట్కారి ట్వీట్ చేశారు. అయితే మహిళా పోలీసు అధికారిని లక్ష్యంగా చేసుకోవడంపై ఎన్సీపీ అధ్యక్షుడు శరత్చంద్ర పవార్, ఎంపీ సుప్రియా శూలె, కాంగ్రెస్ నేత యశోమతి థాకూర్లు మిట్కారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మిట్కారి తోక ముడిచి క్షమాపణ చెప్పారు. ట్వీట్ను ఉపసంహరించుకున్నారు.