నవతెలంగాణ – రాయికల్
మండలంలోని అయోధ్య గ్రామంలో చిల్లర లేదనే కారణంతో గత నాలుగు నుంచి ఐదు నెలలుగా పింఛనుదారులకు పూర్తిస్థాయి పింఛన్ ఇవ్వడం లేదని బాధితులు ఆరోపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2016 పింఛన్కు గాను కేవలం రూ.2000 మాత్రమే ఇచ్చి, మిగిలిన రూ.16 చిల్లర లేదని వచ్చే నెల ఇస్తానని చెబుతూ పింఛన్ బుక్లో రాసానంటూ సంబంధిత పోస్ట్ మ్యాన్ తిరిగి పంపుతున్నారని తెలిపారు.
ఈ విషయంపై సంబంధిత పోస్టుమ్యాన్ శ్రీనివాస్ను వివరణ కోరగా.. గత రెండు నెలలుగా తన వద్ద చిల్లర లేకపోవడంతో ఇవ్వలేకపోతున్నానని, పింఛన్ బుక్లో నమోదు చేస్తున్నానని సమాధానం ఇచ్చారు. ఈ అంశంపై జగిత్యాల సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టాఫీస్ అధికారి షఫీఉద్దీన్ను వివరణ కోరగా.. దీనిపై శాఖాపరమైన విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఎంపీడీవో బింగి చిరంజీవి మాట్లాడుతూ.. పింఛనుదారులను మోసం చేసినట్లుగా ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పూర్తి మొత్తంలో పింఛన్ అందేలా చర్యలు చేపడతామని తెలిపారు.



