సంతకం చేసిన ద్రౌపది ముర్ము
ఇక ఎంజీఎన్ఆర్ఈజీఏ కనుమరుగు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పేరు మారుస్తూ కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వీబీ-జీ రామ్ జీ బిల్లు2025కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ) బిల్లుపై ఆదివారం ద్రౌపది ముర్ము సంతకం చేశారు. దాంతో..దాదాపు ఇరవై ఏండ్లుగా కరువు పనిగా కొనసాగుతున్న ఎంజీఎన్ఆర్ఈజీఏ కనుమరుగవ్వనుంది. గ్రామీణ పేదలకు జీవనాడిగా ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ చట్టాన్ని మార్చివేసింది.
గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు 100 రోజులు ఉపాధి కల్పిస్తూ వామపక్షాల మద్దతుతో నాటి యూపీఏ ప్రభుత్వం 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే.. మోడీ ప్రభుత్వం ఈ చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాలనే ఉద్దేశంతో పాటు, గ్రామీణ ఉపాధి రంగాన్ని కుదిస్తూ, రాష్ట్రాలపై భారాలు మోపుతూ కొత్త చట్టం తెచ్చింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాల సూచనలను, అభిప్రాయాలను ఖాతరు చేయకుండా మోడీ సర్కారు ఏకపక్షంగా బిల్లును ఆమోదించుకుంది. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. ఆదివారం ఆ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారు. ఈ కొత్త చట్టంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాల్లోనూ కీలక మార్పులు చేశారు. ఇంతకుముందు హిమాలయ పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ఈ వాటా 90:10గా ఇతర రాష్ట్రాల్లో 75:25గా ఉండేది. ఇక నుంచి కేంద్ర, రాష్ట్రాలు ఖర్చులను 60:40 శాతంలో భరించనున్నాయి.



