నవతెలంగాణ – హైదరాబాద్ : నిజామాబాద్లో సంచలనం సృష్టించిన చిత్తరి హరిబాబు హత్య కేసు నిందితుడు, యూట్యూబర్ వైష్ణవి సోదరుడు గంధం సంతోష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు విశాఖపట్నం పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన హరిబాబు, మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 16న హరిబాబు తన భార్య వైష్ణవిని హత్య చేశాడు. ఈ కేసులో హరిబాబు, అతడి తల్లి, ఇద్దరు సోదరులు జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్పై బయటకు వచ్చారు.
అప్పటి నుంచి హరిబాబు తల్లి నిజామాబాద్లోని సాయినగర్లో అద్దె ఇంట్లో ఉంటోంది. నెల రోజుల క్రితం జైలు నుంచి వచ్చిన హరిబాబు, తన తల్లిని చూసేందుకు ఈ నెల 17న నిజామాబాద్ వచ్చాడు. ఇదే అదునుగా భావించిన వైష్ణవి అన్న సంతోష్, హరిబాబుపై కత్తితో దాడి చేసి హతమార్చి కారులో పరారయ్యాడు. అనంతరం ఈ హత్యను తానే చేశానని, తన చెల్లెలి హత్యకు ప్రతీకారంగా హరిబాబును అంతమొందించానని నిందితుడు సంతోష్ అదే రోజు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.



