నవతెలంగాణ – హైదరాబాద్ : భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో నిరాశ ఎదురైంది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఆమె పోరాడి ఓడింది. చైనా క్రీడాకారిణి, వరల్డ్ నంబర్ 3 వాంగ్ జి యితో జరిగిన హోరాహోరీ పోరులో సింధు పరాజయం పాలైంది. దీంతో టోర్నీలో ఆమె ప్రస్థానం ముగిసింది. ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో సుమారు 90 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో సింధు 11-21, 21-15, 17-21 తేడాతో వాంగ్ చేతిలో ఓటమి చవిచూసింది. వరల్డ్ ఛాంపియన్షిప్లో చైనా క్రీడాకారిణులపై అద్భుతమైన రికార్డు ఉన్న సింధుకు ఇదే తొలి పరాజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్కు ముందు ఆమె చైనా ప్లేయర్స్తో 8-0 రికార్డుతో ఉంది.
తొలి గేమ్ను సులువుగా కోల్పోయిన సింధు, రెండో గేమ్లో అద్భుతంగా పుంజుకొని మ్యాచ్ను నిర్ణయాత్మక మూడో గేమ్కు తీసుకెళ్లింది. మూడో గేమ్లోనూ సింధు ఒక దశలో ఆధిక్యంలో నిలిచింది. స్కోరు 16-16తో సమమైనప్పుడు వాంగ్ జి యి కండరాల నొప్పితో మెడికల్ టైమ్అవుట్ తీసుకుంది. ఈ విరామం తర్వాత సింధు ఏకాగ్రత కోల్పోయి వరుసగా తప్పిదాలు చేసింది. ఇదే వాంగ్ విజయానికి బాటలు వేసింది. ప్రత్యర్థి తీసుకున్న బ్రేక్ వ్యూహాత్మకమా అనే సందేహాన్ని సింధు వ్యక్తం చేసింది. ఈ ఓటమితో వరల్డ్ ఛాంపియన్షిప్లో ఆరో పతకం సాధించాలన్న సింధు ఆశలు ఆవిరయ్యాయి.



