నవతెలంగాణ-హైదరాబాద్: గత కొన్ని నెలలుగా అమెరికా- ఇరాన్ యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇంధన సంక్షోభం ఏర్పడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ప్రపంచానికి ఉపశమనం కలిగించేలా.. అమెరికా – ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని.. బహుశా దీనికి సంబంధించి కొన్ని గంటల్లోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని సౌదీ అరేబియా ప్రభుత్వ నేతృత్వంలోని న్యూస్ ఛానెల్ అల్ అరేబియా శుక్రవారం నివేదించింది.
అమెరికా – ఇరాన్ కుదుర్చుకున్న ముసాయిదా ఒప్పందంలో భూ, సముద్ర, వాయు రంగాలలో తక్షణమే బేషరతు కాల్పుల విరమణకు సంబంధించి అంశాలు ఉండనున్నాయని అల్ అరబియా పేర్కొంది. అలాగే ఈ ఒప్పందంలో, సైనిక కార్యకలాపాలకు, మీడియా వైరుధ్యాలకు ముగింపు పలకడంతో పాటు, సైనిక, పౌర, ఆర్థిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోకూడదని ఇరుపక్షాలు పరస్పరం కట్టుబడి ఉండాలనే నిబంధన కూడా ఉన్నట్లు సమాచారం. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమ్రగత పట్ల గౌరవం, ఇరు దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని కూడా ఈ ఒప్పందంలో పొందుపరిచినట్లు సమాచారం.
అలాగే అరేబియా గల్ఫ్, హోర్ముజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్లలో నౌకాయాన స్వేచ్ఛకు కూడా హామీ ఇస్తుంది. ఈ ఒప్పందం అమలును పర్యవేక్షించడానికి, ఇరు పక్షాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి ఒక ఉమ్మడి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఈ ముసాయిదా ప్రతిపాదించింది.
ఒప్పందం అమల్లోకి వచ్చిన ఏడు రోజుల్లోగా పెండింగ్లో ఉన్న సమస్యలపై చర్చలు ప్రారంభమవుతాయని కూడా అందులో పేర్కొన్నట్లు అల్ అరబియా నివేదించింది. ఇరాన్పై ఇప్పటివరకు అమెరికా పెట్టిన ఆంక్షల్ని కూడా ఎత్తివేయనుంది. ఈ ముసాయిదా అంతర్జాతీయ చట్టానికి, ఐక్యరాజ్యసమితి పేర్కొన్నట్లు శాంతి, భద్రత, మానవ హక్కులకు కట్టుబడి ఉండటాన్ని పునరుద్ఘాటిస్తున్నట్లు సమాచారం. వాషింగ్టన్, టెహ్రాన్లు అధికారికంగా ప్రకటించిన వెంటనే ఈ ఒప్పందం అమల్లోకి రానుందని అల్ అరేబియా న్యూస్ ఛానల్ పేర్కొంది.



