నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మండల ప్రత్యేక అధికారులు మండలాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి చెప్పారు. ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.సోమవారం ఆమె ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
మండల ప్రత్యేక అధికారులు రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, విద్యాసంస్థలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. ఇటీవల కాలంలో జిల్లాలో అక్కడక్కడ ఆడపిల్లల విషయంలో జరుగుతున్న సంఘటనలు,బాల్యవివాహాల ను దృష్టిలో ఉంచుకొని ఇకపై అలాంటివి జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని,ఇందుకుగాను మండలాలలో పాఠశాలలు, విద్యాసంస్థలు సందర్శించినప్పుడు వారికి అవగాహన కల్పించాలని, ఎవరైనా ఆడపిల్లల పట్ల అత్యాచారాలకు పాల్పడినట్లయితే కఠినంగా శిక్షించబడతారన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలన్నారు. ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సైతం మండలాధికారులు పర్యవేక్షించాలని అన్నారు నిర్మాణ పనులపై దృష్టి సారించి త్వరత గతిన నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు .
ఈ సమావేశానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ఇన్చార్జి డిఆర్ఓవై. అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, ఆర్డీవోలు, జిల్లా అధికారులు హాజరయ్యారు.



