- Advertisement -
- ఉదయం 10.30 గంటలకు శిల్పకళావేదికలో నిర్వహణ : ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాష్ణన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళావేదికలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఇంటర్ విద్యా కమిషనర్ కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా కేంద్ర మంత్రులు జి కిషన్రెడ్డి, బండి సంజరు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు ప్రత్యేక అతిథులుగా శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, రాష్ట్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోపాటు విశిష్ట అతిథిగా సీఎస్ కె రామకృష్ణారావు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేస్తారు. వారిని సన్మానించడంతోపాటు రూ.10 వేల నగదు, ప్రశంసాపత్రం, శాలువా, బంగారుపూత పూసిన రజత పతకాన్ని అందజేస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరవుతున్నారు. గతేడాది గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. 2014, సెప్టెంబర్ ఐదో తేదీన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గురుపూజోత్సవానికి హాజరయ్యారు. ఆ తర్వాత హాజరు కాలేదు. ఏటా విద్యాశాఖ మంత్రి హాజరయ్యే వారు. ప్రస్తుతం విద్యాశాఖను కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే.
- Advertisement -