నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన సిపిఐ నాయకుడు చౌడబోయిన బిక్షపతి (74) బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి గ్రామంలోనే కాకుండా పార్టీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. చౌడబోయిన బిక్షపతి అనేక దశాబ్దాలుగా సిపిఐ పార్టీకి అంకితభావంతో సేవలందించారు. గ్రామ స్థాయిలో పార్టీ నిర్వహించిన పలు కార్యక్రమాలలో ముందుండి పనిచేసిన ఆయన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగిన అనేక ఆందోళనలు, పోరాటాలలో చురుకైన పాత్ర పోషించారు.
సామాన్య ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని నాయకులు తెలిపారు. ఆయన మృతికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్, మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య, చౌడబోయిన పరుశరాములు, గొట్టిపాముల శ్రీనివాసరాజు, గిరబోయిన స్వామి నమిలే స్వామి తదితరులు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతాల కోసం చివరి వరకు కట్టుబడి పనిచేశారని గుర్తుచేశారు.



