కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లింపు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయప్రతినిధి/ములుగు
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్ దంపతులు వన దేవతలను దర్శించుకున్నారు. మంత్రులు దనసరి అనసూయ (సీతక్క), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర అధికారులు, ఆదివాసీ సంప్రదాయ కళాకారుల నృత్య ప్రదర్శనతో స్వాగతం పలికారు. నిలువెత్తు బంగారంతో అమ్మవార్లకు మొక్కులు సమర్పించారు. అనంతరం సమ్మక్క-సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందాలని తల్లులను వేడుకున్నామని తెలిపారు. చరిత్రాత్మక కట్టడాలు దేశప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయని, గతం కంటే ఈ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారని అన్నారు.
సందర్శించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు
సమ్మక్క సారలమ్మలను జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్నాయక్, నిరుపమ సుక్మా, తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీపీ విక్రమ్ సింగ్మాన్ తదితరులు దర్శనం చేసుకొని మొక్కులు సమర్పించారు. వారికి జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ స్వాగతం పలికారు.



