ఇప్పటివరకు 80లక్షల మంది దర్శనం
సమ్మక్క కొలువుదీరే సమయానికి కోటికి మించే అవకాశం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/ములుగు
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం మేడారంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటివరకు దాదాపు 80 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారని, సమ్మక్క గద్దెపైకి వచ్చే సమయానికి ఈ సంఖ్య కోటికి మించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో జనం మేడారానికి తరలివస్తున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. మేడారం జాతర ప్రాంతం శాశ్వత అభివృద్ధి కోసం సుమారు 70ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
ఇప్పటికే 29 ఎకరాల భూమిని సేకరించామని, మరో 41 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఈ ప్రాంతంలో శాశ్వతంగా కాటేజీలు, ఫంక్షన్ హాళ్లు, మరిన్ని మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించనున్నట్టు వివరించారు. దక్షిణ భారత కుంభమేళాగా పేరొందిన మేడారం జాతర ప్రాధాన్యతను మరింత పెంచేందుకు బాసర నుంచి భద్రాచలం వరకు రూ.2,500 కోట్ల వ్యయంతో టెంపుల్ సర్క్యూట్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధిలో మేడారం ఆలయాన్ని కూడా భాగం చేయ నున్నట్టు చెప్పారు. జంపన్న వాగులో ఏడాది పొడవునా నీరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, రామప్ప-లక్నవరం-జంపన్న వాగు వరకు పైప్లైన్ ద్వారా నీటిని తరలించే ప్రాజెక్టును ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారని తెలిపారు. వాగుపై చెక్డ్యామ్లు నిర్మించి శాశ్వత నీటి నిల్వకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. మేడారం ప్రాంతానికి ఇప్పటికే ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని, దాని ప్రకారం అంతర్గత రోడ్ల అభివృద్ధి, ఎకో పార్కుల ఏర్పాటు, పర్యాటక సౌకర్యాల విస్తరణ చేపట్టనున్నట్టు వెల్లడించారు.
దుష్ప్రచారాలను నమ్మొద్దు : మంత్రి సీతక్క
సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మొద్దని సందర్శకులకు మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. గతంలో ఇరుకైన రోడ్ల కారణంగా ఇబ్బందులు ఉండేవని, ఈసారి 4 లైన్ల రోడ్లతో రాకపోకలు చాలా సులభమయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో శాశ్వత తాగునీటి వ్యవస్థతో పాటు పలు అభివృద్ధి పనులూ చేపట్టనున్నట్టు చెప్పారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విస్తృతంగా చెట్ల పెంపకం చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. జాతర విజయవంతానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికార యంత్రాంగం, మీడియా మిత్రులకు సీతక్క అభినందనలు తెలిపారు. కాగా, శనివారం సాయంత్రం 4 గంటలకు తల్లులు గద్దెల నుంచి తిరిగి వనప్రవేశం చేయనున్నారని, అప్పటివరకు భక్తులు ఓపికతో దర్శనాలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.



