బీజింగ్ : తమ దేశంలో ప్రామాణిక సమయాన్ని పర్యవేక్షించే నేషనల్ టైమ్ సెంటర్పై అమెరికా సైబర్ దాడి చేసినట్టు చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ ఆరోపించింది. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక కథనంలో పేర్కొంది. ఈ హ్యాకింగ్ వెనుక అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ హస్తం ఉన్నట్టు వెల్లడించింది. మార్చి 2022లో తొలిసారి ఈ సైబర్ దాడులు మొదలైనట్టు పేర్కొంది. నేషనల్ టైమ్ సెంటర్లోని ఉద్యోగుల ఫోన్లు, కంప్యూటర్ల నుంచి సున్నితమైన సమాచారాన్ని అమెరికన్లు తస్కరించినట్టు చెప్పింది. ఈ ఆరోపణలపై అమెరికా ఇప్పటివరకు స్పందించలేదు. టైమ్ సెంటర్ ఉద్యోగులు వాడే విదేశీ ఫోన్లలోని మెసేజింగ్ యాప్లో ఉన్న బలహీనతలను ఆధారంగా చేసుకొని హ్యాకింగ్కు పాల్పడినట్టు చైనా పేర్కొంది.
అమెరికా, ఐరోపా, ఆసియా వ్యాప్తంగా ఉన్న వర్చువల్ సర్వర్లను దాడులకు వాడుకొన్నట్టు పేర్కొంది. దీనికి సంబంధించిన బలమైన ఆధారాలను చైనా సైబర్ సెక్యూరిటీ సంస్థలు సేకరించినట్టు వెల్లడించింది. దీంతో పాటు తమ రక్షణ వ్యవస్థను కూడా అప్గ్రేడ్ చేసుకొన్నట్టు చెప్పింది. చైనాలోని షాంక్సీ ప్రావిన్స్లోని షియాన్ నగరంలో నేషనల్ టైమ్ సర్వీస్ సెంటర్ ఉంది. చైనీస్ ఆకాడమీ ఆఫ్ సైన్సెస్ దీన్ని నిర్వహిస్తోంది. దేశంలోని ప్రామాణిక సమయాన్ని అత్యంత కచ్చితత్వంతో నిర్వహిస్తోంది. ముఖ్యంగా కమ్యూనికేషన్స్, ఫైనాన్స్, పవర్, ట్రాన్స్పోర్ట్, మ్యాపింగ్ డిఫెన్స్ రంగాలకు ఇది అత్యంత కీలకమైంది.
చైనా నేషనల్ టైమ్ సెంటర్పై అమెరికా సైబర్ దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES