నవతెలంగాణ – హైదరాబాద్ : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఆయన ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించి, సహాయక చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రమాద తీవ్రత, ప్రస్తుత పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం, సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్లాంట్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించాలని స్థానిక మంత్రులను, యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.



